బౌలర్లు జాగ్రత్త.. కోహ్లి దులిపేస్తున్నాడు!

12 Sep, 2020 13:08 IST|Sakshi

దుబాయ్‌: ఈసారి ఎలాగైనా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవాలనే లక్ష్యంతో పోరుకు సిద్ధమవుతోంది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు. ఈ జట్టులో ఇప్పటివరకూ హేమాహేమీ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఏ సీజన్‌లోనూ టైటిల్‌ను ముద్దాడలేదు. కేవలం 2016లో మాత్రమై ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ.. గతేడాది మాత్రం చివరి స్థానంలో నిలిచింది. ఇది గతేడాది ఆర్సీబీని బాగా కలవరపెట్టిన అంశం. అయితే ఈసారి మాత్రం కనీసం ప్లేఆఫ్స్‌కు చేరితే ఆ తర్వాత మిగతా పని చూసుకోవచ్చనే ప్రణాళికకు కచ్చితమైన పదునుపెడుతూ బరిలోకి దిగేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఆటగాళ్లు సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. (చదవండి: ఐపీఎల్‌.. బలాబలాలు తేల్చుకుందాం!)

ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అయితే మంచి జోష్‌ మీద ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌లో కొన్ని మంచి క్యాచ్‌లు పట్టిన కోహ్లి.. బ్యాటింగ్‌లో దుమ్ముదులిపేస్తున్నాడు. రెండు వారాల ప్రాక్టీస్‌లో కోహ్లి మంచి ఆకలితో ఉన్న పులిలా ప్రాక్టీస్‌ చేశాడు. ఈ మేరకు వీడియోను ఆర్సీబీ ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో కోహ్లి మాట్లాడుతూ.. ‘ ఇప్పటికి కుదురుకున్నాం. మొదట్లో కొన్ని రోజులు కఠినంగా అనిపించింది. ఐదు నెలల తర్వాత ప్రాక్టీస్‌ చేయడంతో ఫీల్డ్‌లో భారంగా అనిపించింది. గాడిలో పడ్డాం.. ప్రాక్టీస్‌ను ఆస్వాదిస్తున్నాం. ఫీల్డ్‌లో హిట్టింగ్‌ కోణాన్ని ప్రధానంగా పరిశీలించాం.ఈ వికెట్‌పై పేస్‌ ఎలా ఉంటుందో అనే అంశాన్ని కూడా అర్ధం చేసుకున్నాం. ప్రస్తుతం మా టీమ్‌ పూర్తిస్థాయిలో పోరుకు సన్నద్ధం కావడం చాలా సంతోషంగా ఉంది’ అని కోహ్లి తెలిపాడు. ఈ నెల 21వ తేదీన ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు