రహానే అనూహ్య రనౌట్‌, టీమిండియా ఆలౌట్‌

28 Dec, 2020 08:07 IST|Sakshi

మెల్‌బోర్న్‌: తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 277/5 తో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్‌ 326 పరుగులకు ఆలౌట్‌ అయింది. సెంచరీతో జట్టును ఆదుకున్న కెప్టెన్‌ అజింక్యా రహానే అనూహ్యంగా రనౌట్‌ కావడంతో టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. లయన్‌ బౌలింగ్‌లో జడేజా షాట్‌ కొట్టగా రిస్కీ రన్‌ తీసే క్రమంలో రహానే (223 బంతులు 112; ఫోర్లు 12) రనౌట్‌ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 6 వికెట్లకు 294 పరుగులు. ఇక మరికొద్ది సేపటికే అర్ద సెంచరీ సాధించిన జడేజా, అశ్విన్‌తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు.

అయితే, 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా ఏడో వికెట్‌గా వెనుదిరగడంతో మిగతా టెయిలెండర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఉమేశ్‌ యాదవ్‌ (9), అశ్విన్ (14)‌, బుమ్రా (0) వెనువెంటనే ఔటవడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 32 పరుగుల వ్యవధిలో టీమిండియా చివరి ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. స్టార్క్‌, లయన్‌ మూడు వికెట్ల చొప్పున, కమిన్స్‌ రెండు, హేజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ సాధించారు. ఇక ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్‌ కావడంతో.. టీమిండియాకు 131 పరుగుల ఆదిక్యం లభించింది.
(చదవండి: నాయకుడు నడిపించాడు)

మరిన్ని వార్తలు