'సన్‌రైజర్స్‌ బౌలర్లకు యూఏఈ అచ్చి రాలేదు'

27 Sep, 2020 14:17 IST|Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ సీజన్లలో బౌలర్ల సత్తాతో మ్యాచ్‌లు గెలిచిన జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  మాత్రమే. 2012లో సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి చూసకుంటే బ్యాట్సమెన్ల కంటే ఎక్కువ బౌలర్ల సత్తా మీద ఆదారపడే ఎక్కువ మ్యాచ్‌లను గెలిచేది. అయితే కరోనా నేపథ్యంలో యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మాత్రం సన్‌రైజర్స్‌ బౌలర్లకు అక్కడి పిచ్‌లు అంతగా అనుకూలించడం లేదని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్‌ చానెల్‌లో సన్‌రైజర్స్‌ ప్రదర్శనపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. (చదవండి : ఎవరిని నిందించొద్దు.. తప్పంతా నాదే : వార్నర్‌)

'నాకు తెలిసి సన్‌రైజర్స్‌ బౌలర్లు ఇంకా యూఏఈ పిచ్‌లకు అలవాటు పడలేదనిపిస్తుంది. ఇక్కడి పిచ్‌లు వారికి అనుకూలించడం లేదు.  సాధారణంగా యూఏఈలో ఉన్న పిచ్‌లు స్వింగ్‌కు అనుకూలించడం తక్కువ.. పేస్‌ బౌలింగ్‌కు కూడా అంతంతమాత్రంగానే సహకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వింగ్‌ బౌలర్‌ భూవీ యూఏఈ పిచ్‌లపై అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. మిగతా సన్‌రైజర్స్‌ బౌలర్లు కూడా గుడ్‌ లెంగ్త్‌లో తమ బంతులను విసరలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు వారికి పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను పూడ్చాలంటే సన్‌రైజర్స్‌ బౌలర్లు తమ ప్రాక్టీస్‌ను మరింత పెంచాలి. అని వెల్లడించాడు.

ఐపీఎల్‌ 2012 సీజన్లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ ఎన్నో మ్యాచ్‌ల్లో లోస్కోరింగ్‌ చేసినా బౌలర్ల చలువతో విజయాలు సాధించేది. భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌ సహా ఇతర ఆటగాళ్లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 2016లో పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ డేవిడ్‌ వార్నర్‌ సారధ్యంలో ఏకంగా టైటిల్‌నే కొల్లగొట్టింది. దీంతో అప్పటినుంచి వరుసగా ప్రతీ సీజన్‌లోనూ కనీసం ప్లేఆఫ్స్‌కు చేరుతున్న జట్టుగా సన్‌రైజర్స్‌ నిలుస్తూ వచ్చింది. అయితే యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌లో మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ చతికిలపడింది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 164 పరుగుల లక్ష్యం చేధించలేక చతికిలపడగా..  కేకేఆర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో మొదట తక్కువ స్కోరు నమోదు చేసింది. అయితే బౌలర్ల వైఫల్యంతో వార్నర్‌ సేన ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది.(చదవండి : వారెవ్వా కమిన్స్‌.. తిట్టినోళ్లే పొగుడుతున్నారు)

మరిన్ని వార్తలు