‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’

10 Oct, 2020 18:46 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుస ఓటములతో సతమవుతున్నా కింగ్స్‌ పంజాబ్‌ తన సెలక్షన్‌లో పెద్దగా మార్పులేమీ చేయకపోవడంపై వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా పెదవి విరిచాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు సైతం పించ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లకు జతగా క్రిస్‌ గేల్‌ కూడా ఉండి ఆ జట్టు బ్యాటింగ్‌ బలం పెరుగుతుందన్నాడు. బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగా వరుస మ్యాచ్‌లను చేజార్చుకుంటున్న తరుణంలో గేల్‌ను ఆడించకపోవడం తనను నిరుత్సాహానికి గురిచేసిందన్నాడు.(ఎన్నాళ్లకెన్నాళ్లకు దినేశ్‌ కార్తీక్‌..)

క్రిస్‌ గేల్‌ అనేవాడు ప్రత్యర్థి జట్టును భయభ్రాంతులకు గురి చేస్తాడనేది కాదనలేని వాస్తవమన్నాడు. కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌లో పైచేయి సాధించాలంటే గేల్‌ జట్టులో ఉంటేనే అది సాధ్యమవుతుందన్నాడు. ఈ ఐపీఎల్‌లో జోర్డాన్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ అతనికి అవకాశం ఇవ్వడం ఇక్కడ సరైనది కాదన్నాడు. కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో క్రిస్‌ గేల్‌ ఉంటే ఆ బలమే వేరుగా ఉంటుందని లారా అభిప్రాయపడ్డాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడిన లారా.. గేల్‌ను మరొకసారి తీసుకోలేకపోవడం మాత్రం నిరాశకు గురిచేసిందన్నాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో పంజాబ్‌ ఆడిన గత మ్యాచ్‌లో గేల్‌కు‌ అవకాశం ఉంటుందని చివరి వరకూ ఊరించారు. కానీ ఆఖరి నిమిషంలో గేల్‌కు ఫుడ్‌ పాయిజన్‌ అయిందనే కారణంతో తప్పించామని కోచ్‌ అనిల్‌ కుంబ్లే చెప్పుకొచ్చాడు. కాగా, కేకేఆర్‌తో మ్యాచ్‌కు గేల్‌ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్న మరొకసారి వచ్చింది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఫామ్‌లో లేని మ్యాక్స్‌వెల్‌ స్థానంలో గేల్‌ను ఆడించాలని విశ్లేషకుల సైతం అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు