నిర్లక్ష్యమే కేకేఆర్‌ కొంపముంచింది: లారా

14 Apr, 2021 15:27 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్‌/ బీసీసీఐ

చెన్నై: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 103 పరుగులతో పటిష్టంగా కనిపించిన కేకేఆర్‌ ఆ తర్వాత రాహుల్‌ చహర్‌ మాయలో ఇరుక్కొని పరుగులు చేయలేకపోయింది. ఓపెనర్లు గిల్‌, రానాలు జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చినా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఎవరు సరిగా ఆడకపోవడం.. ఒక దశలో పూర్తి ఒత్తిడికి లోనయ్యి ఓటమిని చవిచూసింది. ఇదే విషయమై విండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా స్పందిస్తూ..కేకేఆర్‌ను వారి నిర్లక్ష్యమే కొంపముంచిందంటూ పేర్కొన్నాడు.

''ముంబై ఇండియన్స్‌ సరైన సమయంలో సరైన బౌలర్‌ను ఉపయోగించి విజయం దక్కించుకుంది. అయితే కేకేఆర్‌ నిర్లక్ష్యం కూడా ముంబైకి కలిసొచ్చింది. సాధారణంగానే చెన్నై పిచ్‌ కాస్త మందకొడిగా ఉండడంతో పరుగులు రావడం కష్టమైంది. ముంబై ఇన్నింగ్స్‌ సమయంలోనే ఈ విషయం స్పష్టంగా కనిపించింది. 145- 150 మధ్య స్కోరు చేస్తే మ్యాచ్‌ను కాపాడుకునే అవకాశం ఉన్న చోట.. కేకేఆర్‌ తప్పుచేసింది. ముంబై ఇచ్చిన టార్గెట్‌ను చేధించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. దానిని ఉపయోగించుకొని పిచ్‌ పరిస్థితిని అర్థం చేసుకొని బ్యాటింగ్‌ చేసి ఉంటే కేకేఆర్‌ సునాయస విజయాన్ని దక్కించుకునేది. నితీష్‌ రానా అవుట్‌ తర్వాత మోర్గాన్‌, కార్తీక్‌లు ఇన్నింగ్స్‌ను నడపాల్సింది పోయి అనవసర షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నారు. పరోక్షంగా వారి నిర్లక్ష్యమే కొంపముంచింది.ఇక ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన బుర్రకు పదును పెట్టి రాహుల్‌ చహర్‌తో బౌలింగ్‌ చేయించడం కలిసొచ్చింది. అంతేగాక ఏడేళ్ల తర్వాత రోహిత్‌ బౌలింగ్‌ చేయడం.. దాదాపు షకీబ్‌ వికెట్‌ తీసినంత పని చేశాడు. ఇన్నేళ్ల తర్వాత రోహిత్‌ బౌలింగ్‌ చేయడం వెనుక ముంబై గేమ్‌ ప్లాన్‌ ఏంటో అర్థమైంది. ఈ విజయంతో ముంబైలో జోష్‌ వచ్చినట్లు తెలుస్తుంది. అంటూ చెప్పుకొచ్చాడు.

 ఇక  మ్యాచ్‌లో తొలుత ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌటైంది. టాపార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (32 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిపించారు. రసెల్‌ (5/15) ముంబైని అనూహ్యంగా కట్టడి చేశాడు. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఇక్కడా టాపార్డరే ఆడింది. నితీశ్‌ రాణా (47 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (24 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణిస్తే మిగతా వారెవరూ కనీసం పట్టుమని పది పరుగులైనా చేయలేకపోయారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాహుల్‌ చహర్‌ (4/27) తన స్పిన్‌తో కోల్‌కతాను తిప్పేశాడు. 
చదవండి: ఒక్క విజయం.. అంతే హోటల్‌ రూంకు వేగంగా పరిగెత్తా

ఏడేళ్ల తర్వాత రోహిత్‌.. ఇది వ్యూహం కాదంటారా?

>
మరిన్ని వార్తలు