ICC Media Rights Auction: ఎన్ని వేల కోట్లో! క్రికెట్‌కు కామధేనువు భారత మార్కెట్‌ నుంచి..

26 Aug, 2022 06:09 IST|Sakshi
PC: ICC

భారత్‌లో ఐసీసీ టోర్నీల ప్రసార హక్కులపై వేలం   

దుబాయ్‌: క్రికెట్‌కు కామధేనువు భారత మార్కెట్‌ నుంచి భారీగా ఆర్జించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. వచ్చే ఎనిమిదేళ్లలో (2023–2031 మధ్య) జరిగే ఐసీసీ టోర్నీలను భారత్‌లో ప్రసారం చేసేందుకు ఇచ్చే హక్కుల కోసం నేడు వేలం జరగనుంది. ఐపీఎల్‌ వేలం ద్వారా బీసీసీఐ జాక్‌పాట్‌ కొట్టడంతో ఇప్పుడు అదే తరహాలో ఐసీసీ వేలం నిర్వహించనుంది. టీవీ, డిజిటల్, టీవీ అండ్‌ డిజిటల్‌ అంటూ మూడు వేర్వేరు కేటగిరీల కోసం వేలం జరుగుతుంది.

నాలుగేళ్ల కాలానికి లేదా ఎనిమిదేళ్ల కాలానికి హక్కులను కేటాయిస్తారు. 2023–2031 మధ్య పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 22 ఐసీసీ ఈవెంట్లు ఉన్నాయి. వన్డే, టి20 ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్‌ ట్రోఫీ, అండర్‌–19 వరల్డ్‌కప్‌లు కూడా ఇందులో భాగమే.

హక్కులను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా ఐదు కంపెనీలు బరిలో నిలిచాయి. డిస్నీ స్టార్, సోనీ, జీ, వయాకామ్, అమెజాన్‌ సంస్థలు వేలంలో పెద్ద మొత్తం చెల్లించేందుకు పోటీ పడనున్నాయి. మొత్తంగా ఒక్క భారత మార్కెట్‌ నుంచి ఐసీసీ సుమారు 4 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 32 వేల కోట్లు) ఆశిస్తోంది.

చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్‌! కానీ కోహ్లి మాత్రం..
 ICC T20 WC 2022: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. అభిమానులకు గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు