ముంబై ఇండియన్స్‌కు అతి భారీ షాక్‌.. ఐపీఎల్‌ నుంచి బుమ్రా ఔట్‌..! 

27 Feb, 2023 10:10 IST|Sakshi

గాయం కారణంగా గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా.. వచ్చే నెలాఖరిలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ ద్వారా రీఎంట్రీ ఇస్తాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విధితమే. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని బీసీసీఐ, ఐపీఎల్‌ వర్గాలు తాజాగా కొట్టిపారేశాయి.

బుమ్రా గాయం గతంలో డాక్టర్లు నిర్ధారించిన దాని కంటే తీవ్రంగా మారిందని, అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఈ క్రమంలో బుమ్రా.. ఐపీఎల్‌-2023 సీజన్‌తో పాటు జూన్‌లో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండడం అనుమానమేనని సూచనప్రాయంగా వెల్లడించాయి.

దీంతో బుమ్రాను ఆసియా కప్‌ సమయానికి కంతా జట్టులోకి తీసుకురావాలని భావించిన టీమిండియా ఆశలు అడియాశలుగా మిగిలిపోనున్నాయి. అలాగే బుమ్రా గాయంపై తాజా సమాచారం అతని ఐపీఎల్‌ జట్టైన ముంబై ఇండియన్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన​ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఫిట్‌నెస్‌ సాధించేందుకు శతవిధాల శ్రమిస్తున్నాడు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా.. ఆస్ట్రేలియాతో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా.. రెండిటిలోనూ టీమిండియానే విజయం సాధించింది. మూడో టెస్ట్‌ మార్చి 1 నుంచి ప్రారంభంకానుంది. టెస్ట్‌ సిరీస్‌ తర్వాత భారత్‌-ఆస్ట్రేలియా జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడతాయి. తొలుత వన్డే సిరీస్‌ సమయానికి కంతా బుమ్రా ఫిట్‌గా ఉంటాడన్న ప్రచారం కూడా జరిగింది. అయితే జరిగిన ప్రచారాన్ని  పటాపంచలు చేస్తూ బుమ్రా.. టీమిండియా, ముంబై ఇండియన్స్‌లకు భారీ షాకిచ్చాడు. 

మరిన్ని వార్తలు