BWF World Championships 2022: చిరాగ్‌- సాత్విక్‌ జోడీ సంచలన విజయం.. సరికొత్త చరిత్ర

26 Aug, 2022 10:54 IST|Sakshi
చిరాగ్‌- సాత్విక్‌ జోడీ సరికొత్త చరిత్ర(PC: BAI Media Twitter)

Chirag Shetty and Satwiksairaj Rankireddy: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ చిరాగ్‌ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో ప్రపంచ‌ చాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌ జంటగా నిలిచింది. టోక్యో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో జపాన్‌ బ్యాడ్మింటన్‌ జోడీతో తలపడి ఈ రికార్డు సాధించింది.

కాగా బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌-2022లో భాగంగా చిరాగ్‌ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి ద్వయం.. రెండో సీడ్‌ టకురో హోకి- యుగో కొబయాషి(జపాన్‌)తో క్వార్టర్‌ ఫైనల్లో తలపడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ తొలి గేమ్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైనా భారత జోడీ 24-22తో పైచేయి సాధించింది.

అయితే, రెండో గేమ్‌లో మాత్రం జపాన్‌ షట్లర్ల ద్వయం.. చిరాగ్‌- సాత్విక్‌లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. 21-15తో ఓడించింది. తిరిగి పుంజుకున్న భారత జంట 21-14తో టకురో హోకి- యుగో కొబయాషిలను మట్టికరిపించి విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. ఇక చిరాగ్‌- సాత్విక్‌ జోడీ కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే.

చదవండి: Virat Kohli: ధోనితో ఉన్న ఫొటో షేర్‌ చేసి కోహ్లి భావోద్వేగం! రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా అంటూ.. ఫ్యాన్స్‌ ఆందోళన!

మరిన్ని వార్తలు