Mohammad Rizwan: కోహ్లి తిరిగి ఫామ్‌లోని రావాలని దేవుడిని ప్రార్థిస్తా..!

12 May, 2022 17:29 IST|Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అమితంగా అభిమానించే పాకిస్థాన్‌ వికెట్‌కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌.. రన్‌ మెషీన్‌ పేలవ ఫామ్‌పై తెగ ఆందోళన చెందుతున్నాడు. కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావాలని దేవున్ని ప్రార్ధిస్తానని అంటున్నాడు. కోహ్లి ఓ ఛాంపియన్‌ ప్లేయర్‌ అని, అతను ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను తప్పక అధిగమిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమేనని, కోహ్లి లాంటి హార్డ్‌ వర్కర్‌ను ఇలాంటి దశలు మరింత రాటుదేలుస్తాయని, కోహ్లి త్వరలోనే మునుపటి కంటే భీకరమైన ఫామ్‌ను అందుకుంటాడని అన్నాడు. ప్రస్తుతం టీమిండియా నయా వాల్‌ పుజారాతో పాటు ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడుతున్న రిజ్వాన్‌.. క్రిక్‌విక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించాడు. 

కాగా, గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా రిజ్వాన్‌.. కోహ్లిని హత్తుకున్న ఫొటో  వైరలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రిజ్వాన్‌ ప్రదర్శనకు ముగ్దుడైన కోహ్లి... మ్యాచ్‌ అనంతరం అతనితో చాలా సేపు ముచ్చటించాడు. మ్యాచ్‌ కోల్పోయామన్న బాధలోనూ కోహ్లి.. రిజ్వాన్‌ని ప్రశంసిస్తూ క్రీడాస్పూర్తిని చాటుకున్న వైనం ఇరు దేశాల అభిమానులను ఆకట్టుకుంది. 

రిజ్వాన్‌ సైతం కోహ్లి హుందాతనాన్ని చూసి తెగ సంబురపడిపోయాడు. టీ20 ప్రపంచకప్‌ 2021లో 6 మ్యాచ్‌ల్లో 280 పరుగులు చేసిన రిజ్వాన్‌.. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌లు చెలరేగడంతో పాక్‌.. భారత్‌పై తొలి ప్రపంచకప్‌ విజయాన్ని సాధించింది. 
చదవండి: ఎన్ని గోల్డెన్‌ డకౌట్లైనా.. కోహ్లి ఇప్పటికీ గోల్డే..!

మరిన్ని వార్తలు