Chess Olympiad 2022: భారత జట్ల జోరు

31 Jul, 2022 05:49 IST|Sakshi

చెన్నై: చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్లు వరుసగా రెండో విజయం నమోదు చేశాయి. శనివారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఓపెన్‌ విభాగంలో భారత్‌ ‘ఎ’ 3.5–0.5తో మాల్డోవాపై, భారత్‌ ‘బి’ 4–0తో ఎస్తోనియాపై, భారత్‌ ‘సి’ 3.5–0.5తో మెక్సికోపై గెలుపొందాయి. మహిళల విభాగం రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో కోనేరు హంపి, తానియా సచ్‌దేవ్, వైశాలి, భక్తి కులకర్ణిలతో కూడిన భారత్‌ ‘ఎ’ 3.5–0.5తో అర్జెంటీనాపై, భారత్‌ ‘బి’ 3.5–0.5తో లాత్వియాపై, భారత్‌ ‘సి’ 3–1తో సింగపూర్‌పై విజయం సాధించాయి.

మరీసా (అర్జెంటీనా)తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎం) తానియా సచ్‌దేవ్‌ 36 ఎత్తుల్లో అనాపవోలాపై, వైశాలి 90 ఎత్తుల్లో మరియా జోస్‌పై, భక్తి కులకర్ణి 44 ఎత్తుల్లో మరియా బెలెన్‌పై గెలిచారు. ఓపెన్‌ విభాగంలో భారత్‌ ‘ఎ’కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ తన ప్రత్యర్థి ఇవాన్‌ షిట్కోపై నెగ్గగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ తన ప్రత్యర్థి మెకోవరితో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు