Chess Olympiad: ఎదురులేని భారత్‌

4 Aug, 2022 08:52 IST|Sakshi

చెన్నై: చెస్‌ ఒలింపియాడ్‌ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు వరుసగా ఆరో విజయంతో టాప్‌ ర్యాంక్‌లోకి వచ్చింది. జార్జియాతో బుధవారం జరిగిన ఆరో రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ 3–1తో గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నానా జాగ్‌నిద్జెతో జరిగిన గేమ్‌లో హంపి 42 ఎత్తుల్లో...లెలా జావఖిష్‌విలితో గేమ్‌లో వైశాలి 36 ఎత్తుల్లో గెలిచారు.

నినో బాత్సియాష్‌విలితో గేమ్‌ను హారిక 33 ఎత్తుల్లో... సలోమితో జరిగిన గేమ్‌ను తానియా 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ‘బి’ 3–1తో నెగ్గగా... చెక్‌ రిపబ్లిక్‌తో మ్యాచ్‌ను భారత్‌ ‘బి’ 2–2తో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్‌ విభాగంలో భారత్‌ ‘ఎ’–ఉజ్బెకిస్తాన్‌ మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’కాగా... భారత్‌ ‘బి’ 1.5–2.5తో అర్మేనియా చేతిలో ఓడిపోయింది. భారత్‌ ‘సి’ 3.5–0.5తో లిథువేనియాపై గెలిచింది. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం ఏడో రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. 

మరిన్ని వార్తలు