Cheteshwar Pujara: అన్నీ తానై.. కష్టకాలంలో అర్థసెంచరీ

2 Mar, 2023 16:15 IST|Sakshi

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా కష్టకాలంలో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇండోర్‌ వేదికగా మొదలైన మూడో టెస్టులో  పుజారా అర్థశతకంతో మెరిశాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒక ఎండ్‌లో నిలబడి టీమిండియా ఇన్నిం‍గ్స్‌ను నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ 45.1 ఓవర్లో 108 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు.

పుజారా టెస్టు కెరీర్‌లో ఇది 35వ హాఫ్‌ సెంచరీ కావడం గమనార్హం. పిచ్‌పై బంతి అనూహ్యంగా టర్న్‌ అవుతుండడంతో ఎలా బ్యాటింగ్‌ చేయాలో అర్థం కాక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుజారా మాత్రం తన విలువేంటో చూపిస్తూ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే 2021 ఏడాది నుంచి చూసుకుంటే టెస్టుల్లో పుజారా బ్యాటింగ్‌ సగటు తొలి ఇన్నింగ్స్‌ కంటే రెండో ఇన్నింగ్స్‌లోనే ఎక్కువగా ఉంది. 2021 నుంచి చూసుకుంటే తొలి ఇన్నింగ్స్‌లో పుజారా సగటు 19.04 ఉంటే(22 ఇన్నింగ్స్‌లు).. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 52.06(19 ఇన్నింగ్స్‌లు) సగటు ఉండడం విశేషం.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టీమిండియా ఎదురీదుతోంది. టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. పుజారా 52 పరుగులతో ఆడుతూ ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలగా.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్‌ అయింది.

చదవండి: స్టన్నింగ్‌ క్యాచ్‌.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్‌

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా నిప్పులు చెరిగిన ఉమేశ్‌ 

మరిన్ని వార్తలు