రాహుల్‌, పంత్‌లు ఉన్నారు జాగ్రత్త..

31 Aug, 2020 13:15 IST|Sakshi
దినేశ్‌ కార్తీక్‌(ఫైల్‌ఫోటో)

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న దినేశ్‌ కార్తీక్‌ తన బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మరింతపైకి రావాలని అంటున్నాడు మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా. దినేశ్‌ కార్తీక్‌ టాపార్డర్‌లో ఆడితేనే అతని బ్యాటింగ్‌లో పూర్తి సత్తా  బయటకొస్తుందన్నాడు. అప్పుడే పరుగులు చేయడానికి వీలుపడుతుందన్న చోప్రా.. ఒకవేళ లోయర్‌ ఆర్డర్‌లో వస్తే పరుగులు చేసే అవకాశం రాకపోవచ్చన్నాడు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత జట్టులో కార్తీక్‌ చోటు దక్కించుకోవాలంటే ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పరుగులు చేయాల్సిందేనన్నాడు.(చదవండి: సీఎస్‌కే చేసిన పొరపాటు అదేనా?)

ఒక ఐపీఎల్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నానని భావించి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఐదో స్థానంలో వస్తే మాత్రం దినేశ్‌ కార్తీక్‌ పరుగులు చేసే అవకాశం తక్కువగా ఉంటుందన్నాడు. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలంటే మాత్రం టాపార్డర్‌లో రావాలన్నాడు. దినేశ్‌ కార్తీక్‌ ఒక మంచి వికెట్‌ కీపరే కాకుండా చక్కటి బ్యాట్స్‌మన్‌ అని కూడా చోప్రా పేర్కొన్నాడు. అయితే భారత జట్టులో వికెట్‌ కీపర్‌ పాత్రలో కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌ అయ్యాడని, అదే సమయంలో రిషభ్‌ పంత్‌ కూడా జట్టుకు అందుబాటులో ఉన్నాడన్నారు. వీరిద్దరూ ఉన్నారన్న సంగతిని దృష్టిలో పెట్టుకునే ఐపీఎల్‌లో కార్తీక్‌ ప్రదర్శన ఉండాలన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో కార్తీక్‌ చోటు దక్కించుకోవాలంటే రాహుల్‌, పంత్‌ల నుంచి పోటీ తప్పదన్నాడు. వీరిని మించి నిరూపించుకుంటేనే కార్తీక్‌ టీ20 వరల్డ్‌కప్‌ లక్ష్యం నెరవేరుతుందన్నాడు. తన అభిప్రాయం ప్రకారం దినేశ్‌ కార్తీక్‌ నాల్గో స్థానంలో సరిపోతాడని చోప్రా అభిప్రాయపడ్డాడు.(చదవండి: తొలి బంతికే భయపడ్డాను: కోహ్లి)

>
మరిన్ని వార్తలు