గేల్‌.. నువ్వు త్వరగా కోలుకోవాలి

11 Oct, 2020 16:07 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు ఏది కలిసిరావడం లేదు. శనివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సులభంగా గెలిచే మ్యాచ్‌ను కష్టతరం చేసుకొని ఆపై కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టు దారుణ వైఫల్యం గురించి చెబుతుంది. ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోని మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్లు దారుణంగా ఫేయిలయ్యారు. చివరి బంతిని మ్యాక్స్‌వెల్‌ భారీ షాట్‌కు ప్రయత్నించినా.. దురదృష్టం ఆ జట్టును వెంటాడుతుండడంతో అది బౌండరీగా మారి వారి పాలిట శాపంగా మారింది. లీగ్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్న మ్యాక్స్‌వెల్‌ స్థానంలో క్రిస్ ‌గేల్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. (చదవండి : ‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’)

శనివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గేల్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే గేల్‌ను జట్టులోకి తీసుకోకపోవడం వెనుక బలమైన కారణమే ఉంది. నిజానికి ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే గేల్‌ను తీసుకోవాలని భావించారు. కానీ గేల్‌కు ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో ఆసుపత్రిలో చేరాడని.. అందుకే మ్యాచ్‌ ఆడలేదని ఆ జట్టు హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే స్పష్టం చేశాడు. ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉన్నా కాస్త అనారోగ్యం ఉండడంతో కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగలేదని పేర్కొన్నాడు. కాగా గేల్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన అతని అభిమానులు గేల్‌ నువ్వు త్వరగా కోలుకోవాలంటూ సోషల్‌మీడియాలో కామెంట్స్‌ షేర్‌ చేశారు. దీంతో క్రిస్‌ గేల్‌ తన ఆరోగ్య పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను విడుదల చేశాడు.

'మీ అందరికి ఒక విషయం చెప్పదలచుకున్న. సమస్యలో ఉన్నప్పుడు పోరాటం చేయకుండా నేను వెనుకడుగు వేయను. నేను యునివర్స్‌ల్‌ బాస్‌ను.. నేను ఎన్నటికి మారను. ఎంత కష్టం వచ్చిన దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను తప్ప నా శైలిని మార్చుకోను. బతకడం అనేది ఒక కళ.. అది అందరికి రాదు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా.. మీ ఆశీర్వాద బలం ఎప్పటికి ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటాన్నా. నా కోసం ప్రార్ధించిన మీ అందరికి ధన్యవాదాలు. అంటూ తెలిపాడు.

కాగా పంజాబ్‌ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇకపై పంజాబ్‌కు ప్రతీ మ్యాచ్‌కు కీలకంగా మారనుంది. ఇప్పటినుంచి ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ పం‍జాబ్‌ గెలవాల్సి ఉంటుంది. తన తర్వాతి మ్యాచ్‌ను అక్టోబర్‌ 15న ఆర్‌సీబీతో తలపడనుంది.(చదవండి : దినేశ్‌ కార్తీక్‌.. ఏం తిన్నావ్‌: మాజీ క్రికెటర్)‌

మరిన్ని వార్తలు