Legends League Cricket 2022: గేల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న గుజరాత్‌ జెయింట్స్‌

4 Sep, 2022 16:03 IST|Sakshi

ఈనెల (సెప్టెంబర్) 16 నుంచి ప్రారంభంకానున్న లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ) రెండో సీజన్‌ ఆడేందుకు విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ మరోసారి భారత్‌లో అడుగుపెట్టనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ సారధ్యంలోని గుజరాత్‌ జెయింట్స్‌ యూనివర్సల్‌ బాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని గుజరాత్‌ జెయింట్స్‌ యాజమాన్యం అదానీ స్పోర్ట్స్‌లైన్‌ శనివారం​ అధికారికంగా దృవీకరించింది. పొట్టి క్రికెట్‌లో అనేక రికార్డులు కలిగిన గేల్‌ ఎల్‌ఎల్‌సీలో ఆడటం చాలా సంతోషంగా ఉందని లీగ్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా అన్నారు. 

కాగా, గేల్‌తో ఒప్పందానికి ముందే గుజరాత్‌ జెయింట్స్‌ 15 మంది సభ్యుల బృందాన్ని (రూ. 5.51కోట్లు ఖర్చుతో) ఎంపిక చేసుకుంది.  డ్రాఫ్ట్‌ రూల్స్‌ ప్రకారం ఫ్రాంచైజీ పర్సులో (మొత్తం 8 కోట్లు) కొంత డబ్బు మిగిలి ఉండటంతో (రూ. 2.48 కోట్లు) గేల్‌తో ఒప్పందం చేసుకోవాలని యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగా యునివర్సల్‌ బాస్‌తో సంప్రదింపులు జరిపి డీల్‌కు ఖాయం చేసుకుంది. సెహ్వాగ్‌, గేల్‌తో పాటు గుజరాత్‌ జెయింట్స్‌ జట్టులో డేనియల్‌ వెటోరీ, కెవిన్‌ ఓబ్రెయిన్‌, లెండిల్‌ సిమన్స్‌, అజంతా మెండిస్‌, గ్రేమ్‌ స్వాన్‌, మిచెల్‌ మెక్‌లాగెన్‌, రిచర్డ్‌ లెవి, క్రిస్‌ ట్రెమ్లెట్‌, పార్ధివ్‌ పటేల్‌ లాంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. 

గుజరాత్ జెయింట్స్ జట్టు: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), పార్థివ్ పటేల్, క్రిస్ గేల్, ఎల్టన్ చిగుంబురా, క్రిస్ ట్రెమ్లెట్, రిచర్డ్ లెవి, గ్రేమ్ స్వాన్, జోగిందర్ శర్మ, అశోక్ దిండా, డేనియల్ వెటోరి, కెవిన్ ఓబ్రెయిన్, స్టువర్ట్ బిన్నీ, మిచెల్ మెక్‌లాగెన్, లెండిల్ సిమన్స్, మన్విందర్ బిస్లా, అజంతా మెండిస్.
చదవండి: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌.. కెప్టెన్‌ ఎవరంటే..?

మరిన్ని వార్తలు