Pooja Sihag: స్టార్‌ రెజ్లర్‌ భర్త అనుమానాస్పద మృతి

28 Aug, 2022 15:24 IST|Sakshi

Commonwealth Games 2022 Bronze Medallist Pooja Sihags Husband Dies: బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇటీవల ముగిసిన కామన్‌వెల్త్‌ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా రెజర్ల్‌ పూజా సిహాగ్‌ ఇంట్లో విషాదం నెలకొంది. నిన్న (ఆగస్ట్‌ 27) రాత్రి సిహాగ్‌ భర్త అజయ్‌ నందల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

హర్యానాలోని రోహ్‌తక్‌ నగర పరిసర ప్రాంతంలో నందల్‌ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. నందల్‌ మృతదేహం లభించిన ప్రాంతంలో అతని స్నేహితుడు రవి, మరో వ్యక్తిని అచేతనావస్థ స్థితిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. 

కాగా, అజయ్‌ నందల్‌ ఆకస్మిక మరణంపై అతని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. అజయ్‌కు అతని స్నేహితుడు రవి డ్రగ్స్‌ అలవాటు చేశాడని, డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ వల్లే అజయ్‌ మృతి చెంది ఉంటాడని ఆరోపించాడు. అజయ్‌ తండ్రి ఆరోపణలు పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని వెల్లడించారు.

స్వతహాగా రెజ్లర్‌ అయిన అజయ్‌ నందల్.. క్రీడల కోటాలో ఇటీవలే ఆర్మీ ఆఫీసర్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అజయ్‌ నందల్‌ భార్య, భారత స్టార్‌ మహిళా రెజ్లర్‌ పూజా సిహాగ్‌.. ఇటీవల ముగిసిన కామన్‌వెల్త్‌ క్రీడల్లో 76 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించింది. 
చదవండి: డోపింగ్‌లో దొరికిన భారత డిస్కస్‌ త్రోయర్‌ నవ్‌జీత్‌ కౌర్‌

మరిన్ని వార్తలు