CWG 2022: చరిత్ర సృష్టించిన భారత్‌.. స్వర్ణం నెగ్గిన వుమెన్స్‌ టీమ్‌

2 Aug, 2022 19:23 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల లాన్ బౌల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. కామన్‌వెల్త్‌ క్రీడల చరిత్రలో తొలిసారి లాన్ బౌల్స్ క్రీడలో పతకాన్ని సాధించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వుమెన్స్‌ టీమ్‌.. ఫైనల్లో మూడు సార్లు ఛాంపియన్‌ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో భారత్‌ పటిష్టమైన ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆట ఆరంభంలో టీమిండియాను తక్కువ అంచనా వేసిన సఫారీ టీమ్‌.. ఆ తర్వాత తేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక దశలో దక్షిణాఫ్రికా 10-10తో స్కోర్‌ను సమం చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత టీమిండియా రెచ్చిపోయి ప్రత్యర్ధిని అదే స్కోర్‌ వద్ద ఉంచి ఘన విజయం సాధించింది.

భారత జట్టులో రూపా దేవి ట్రికీ, నయన్‌మోనీ సైకియా, లవ్లీ చౌబీ, పింకీ సింగ్ అద్భుతంగా రాణించారు. సెమీస్‌లో భారత్‌.. న్యూజిలాండ్‌ను 16-13 తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది.  ఇదిలా ఉంటే, లాన్‌ బౌల్స్‌లో స్వర్ణంతో భారత్‌ పతకాల సంఖ్య పదికి (4 స్వర్ణాలు, 3 రజతాలు, మూడు కాంస్యాలు) చేరింది.
చదవండి: కామన్‌వెల్త్‌ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్‌ స్విమ్మర్‌

మరిన్ని వార్తలు