డోపింగ్‌లో దొరికిన ‘కామన్వెల్త్‌’ అథ్లెట్లు

21 Jul, 2022 04:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడలకు వారం రోజుల ముందు బర్మింగ్‌హామ్‌కు అర్హత సంపాదించిన స్ప్రింటర్‌ ఎస్‌. ధనలక్ష్మి, ట్రిపుల్‌ జంపర్‌ ఐశ్వర్య బాబు డోపింగ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఇద్దరు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు. 37 మంది సభ్యుల అథ్లెట్ల బృందం నుంచి తప్పించారు.

100 మీ. పరుగు, 4x100 మీ. రిలే పరుగుకు అర్హత సంపాదించిన ధనలక్ష్మి నుంచి అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) మేలో, జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) జూన్‌లో నమూనాలు సేకరించింది.

ఈ రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది. రిలే బృందం నుంచి ఆమెను తప్పించి ఎం.వి.జిల్నాను ఎంపిక చేశారు. గత నెలలో జాతీయ ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఐశ్వర్య 14.14 మీటర్ల జంప్‌తో జాతీయ రికార్డుతో స్వర్ణం గెలిచింది. ఆ సమయంలోనే ఆమె నమూనాలను సేకరించిన ‘నాడా’ పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. 

మరిన్ని వార్తలు