రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో బరిలోకి దిగనున్న సచిన్‌, లారా

9 Feb, 2021 17:19 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాళ్లు మరో సారి బరిలోకి దిగి పేక్షకులకు కనువిందు చేయనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, బ్రియాన్‌ లారా, బ్రెట్‌లీ, తిలకరత్నె దిల్షాన్‌, ముత్తయ్య మురళీధరన్‌తో పాటు భారత్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లకు చెందిన పలువురు ప్రముఖ క్రికెటర్లు పాల్గొనున్నారు. 

ఈ టోర్నీ మార్చి 2 నుంచి 21 వరకు జరగనుంది. కాగా, కరోనా కారణంగా గతేడాది ఈ సిరీస్‌(నాలుగు మ్యాచ్‌ల అనంతరం) వాయిదా పడిన సంగతి తెలిసిందే. రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ టీ20 టోర్నీలో ఆటగాళ్లు తమ మునుపటి ఫామ్‌ను ప్రదర్శిస్తూ పేక్షకులను అలరించేందుకు సన్నద్ధమవుతున్నారు. లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గావస్కర్‌ ఈ సిరీస్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తుండగా, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. 

మరిన్ని వార్తలు