Mitchell Marsh: 'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్‌ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

5 Jun, 2022 07:57 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో తనకు శాపం తగిలిందని.. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఏదో కారణంగా తాను గాయపడుతున్నానని పేర్కొన్నాడు. ప్రస్త్తుతం మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వచ్చింది. ప్రాక్టీస్‌ ముగించుకున్న మార్ష్‌ ఒక మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు.

‘నేను ఇండియాకు రావడానికి కొద్దిరోజుల ముందే (పాకిస్తాన్ లో) గాయపడ్డాను. ఇక్కడికొచ్చి ఒక మ్యాచ్ ఆడాక నాకు కోవిడ్ వచ్చింది.. అప్పుడు నేను నిజంగా షాక్ కు గురయ్యా.  ఏదైనా శాపం తగిలిందా..? అని అనిపించింది. కానీ నేను కోవిడ్ నుంచి త్వరగానే కోలుకున్నా. తిరిగి  ఢిల్లీ జట్టుతో చేరి  మంచి ప్రదర్శనలు చేశా.  అక్కడున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను.

ఇక నేను జట్టులో చేరినప్పుడు  అందరూ రికీ పాంటింగ్ గురించి గొప్పగా చెప్పారు.  ఆటలో అతడు ఏం సాధించాడో ఒక ఆస్ట్రేలియన్ గా నాకు తెలుసు.  అయితే అతడితో కలిసి చేసిన ప్రయాణంలో పాంటింగ్ తన ఆటగాళ్లను ఎంత బాగా చూసుకుంటాడో అర్థమైంది. నేను ఢిల్లీ జట్టుకు ఎంత ముఖ్యమైన ఆటగాడినో  పాంటింగ్ నాకు చెప్పేవాడు. ఆ దిశగా నన్ను మోటివేట్ చేసేవాడు. నాలో నమ్మకం సన్నగిల్లినప్పుడల్లా నాతో మాట్లాడి నా ఆత్మ విశ్వాసం పెంచేలా దోహదం చేసేవాడు.’ అని  మార్ష్  చెప్పాడు. 

కాగా 2020, 21 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన మార్ష్.. అప్పుడు కూడా గాయం కారణంగా అర్థాంతరంగా  టోర్నీల నుంచి తప్పుకున్నాడు. ఇక తాజా సీజన్ లో  8 మ్యాచులాడి.. 251 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా లంకతో మూడు టి20ల సిరీస్‌ జూన్ 7 నుంచి ప్రారంభం కానుంది.

చదవండి: క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆలౌట్‌..!

మరిన్ని వార్తలు