ఏఆర్‌ రెహమాన్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్‌

27 Jan, 2021 17:49 IST|Sakshi

చెన్నై: ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత.. భారతీయ సినీ సంగీత దిగ్గజం ఏఆర్‌ రెహమాన్‌ను టీమిండియా యువ క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కలిసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. చిన్నప్పటి నుంచి ఏఆర్‌ రెహమాన్‌ పాటలు వింటూ పెరిగిన సుందర్‌కు అతనంటే విపరీతమైన అభిమానం. ఆసీస్‌తో​ సిరీస్‌ ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగివచ్చిన సుందర్‌ బుధవారం చెన్నైలోని రెహమాన్‌ స్వగృహంలో కలిసి అతనితో ఫోటోలు దిగాడు. 'నేను ఎంతో ఇష్టపడే రెహమాన్‌ను స్వయంగా కలిశాను.. ఇది నిజంగా ఆహ్లదకరమైన సాయంత్రం' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. కాగా ఈ ఫోటోలను సుందర్‌ తన ట్విటర్‌లో పంచుకున్నాడు. 

కాగా బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో వాషింగ్టన్‌ సుందర్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో సుందర్‌ 62 పరుగులు .. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసి నాలుగో టెస్టులో టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆపై బౌలింగ్‌లోనూ 4 వికెట్లు తీసిన సుందర్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. సుందర్‌ టీమిండియా తరపున ఇప్పటివరకు ఒక వన్డే, ఒక టెస్టు మ్యాచ్‌తో పాటు 21 టీ20లు ఆడాడు.

మరిన్ని వార్తలు