#Ravindra Jadeja: ఆనందంలో సీఎస్‌కే ఆల్‌రౌండర్‌.. సర్‌ జడేజాకు థాంక్స్‌! పోస్ట్‌ వైరల్‌

1 Jun, 2023 08:29 IST|Sakshi

IPL 2023 Winner CSK: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ అజయ్‌ మండల్‌ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ‘సర్‌ జడేజా’, సీఎస్‌కేకు ధన్యవాదాలు చెబుతూ సోషల్‌ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు కారణమేమిటంటే.. ఐపీఎల్‌-2023 ఫైనల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌డేకు వాయిదా పడింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌- గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మే 29 నాటి రిజర్వ్‌డే మ్యాచ్‌లోనూ వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. 

జడ్డూ మ్యాజిక్‌
ఈ క్రమంలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో 214 పరుగులు భారీ స్కోరు నమోదు చేసింది. అయితే, సీఎస్‌కే లక్ష్య ఛేదనకు దిగిన కాసేపటికే వర్షం మొదలుకావడం.. ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో అర్ధరాత్రి వరకు వేచి చూశారు. 

వరణుడు కరుణించడంతో సుమారు 12.05 గంటల ప్రాంతంలో మళ్లీ మ్యాచ్‌ను మొదలుపెట్టారు. ఈ క్రమంలో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో చెన్నై బ్యాటర్లు తలా ఓ చేయి వేయగా.. ఆఖరి రెండు బంతుల్లో విజయానికి 10 పరుగులు అవసరమైన వేళ రవీంద్ర జడేజా మ్యాజిక్‌ చేశాడు.

విన్నింగ్‌ షాట్‌ ఆడిన బ్యాట్‌ లభిస్తే
తొలి బాల్‌కు సిక్సర్‌ బాదిన జడ్డూ.. మలి బంతిని బౌండరీకి తరలించి చెన్నైకి చిరస్మరణీయ విజయం అందించాడు. సీఎస్‌కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరి.. జడ్డూ విన్నింగ్‌ షాట్‌ ఆడిన బ్యాట్‌ బహుమతిగా లభిస్తే ఎవరైనా ఎగిరి గంతేయాల్సిందే కదా!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదోసారి టైటిల్‌ విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించిన జడ్డూ.. ఆ బ్యాట్‌ను అజయ్‌ మండల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో అజయ్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు అతడు.

సీఎస్‌కేకు థాంక్స్‌
‘‘సర్‌ రవీంద్ర జడేజా.. ఫైనల్‌ మ్యాచ్‌లో ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమైన వేళ సర్‌ జడేజా చేసిన అద్భుతం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఇన్నింగ్స్‌ తర్వాత జడేజా ఆ బ్యాట్‌ను నాకు ఆశీర్వాదంగా అందించాడు.

జడ్డూ భాయ్‌తో డ్రెసింగ్‌ రూం షేర్‌ చేసుకునే అవకాశమిచ్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ధన్యవాదాలు’’ అంటూ అజయ్‌ హార్ట్‌ ఎమోజీలు జతచేశాడు. కాగా దేశవాళీ క్రికెట్‌లో ఛత్తీస్‌గఢ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 27 ఏళ్ల అజయ్‌ జాదవ్‌ మండల్‌ను.. సీఎస్‌కే ఐపీఎల్‌-2023 మినీ వేలంలో కొనుగోలు చేసింది.

ఈ లెఫ్టాండర్‌ ఆల్‌రౌండర్‌ కోసం రూ. 20 లక్షలు వెచ్చించింది. అయితే, అజయ్‌కు ఈసారి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. టైటిల్‌ విజేత అయిన జట్టులో భాగమవడంతో పాటు జడేజా అందించిన బ్యాట్‌ రూపంలో మంచి బహుమతి మాత్రం లభించింది.

చదవండి: #MS Dhoni: ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ వల్లే ఇలా! అది నిజంగా విచారకరం.. అయితే
సీఎస్‌కేకు ఫైనల్లో అడ్వాంటేజ్‌ అంటూ ట్వీట్‌! నీకెందుకంత అక్కసు? మరి ముంబై అయితే..

మరిన్ని వార్తలు