సీఎస్‌కే శిబిరంలో కరోనా కలకలం

3 Apr, 2021 19:18 IST|Sakshi
సీఎస్‌కే(ఫైల్‌ఫోటో); ఫోటో సోర్స్‌ బీసీసీఐ

ముంబై: ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో కరోనా వైరస్‌ కలవరం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. మొన్న కేకేఆర్‌ సభ్యుడు నితీష్‌ రాణా కరోనా బారిన పడగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అక్షర్‌ పటేల్‌కు కరోనా బారిన పడి ఐసోలేషన్‌కు వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే సీఎస్‌కే సిబ్బందిలో ఒకరికి కరోనా వచ్చింది. ఇది సీఎస్‌కే జట్టులో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించింది. కాగా, జట్టులోని సభ్యులు కానీ, కోచింగ్‌ స్టాఫ్‌కు కానీ ప్లేయర్స్‌ కానీ కరోనా రాకపోవడంతో సీఎస్‌కే యాజమాన్యం కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఏప్రిల్‌10 తేదీన ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌-సీఎస్‌కే జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ తరుణంలో ఢిల్లీలోని ఆటగాడు అక్షర్‌కు, ఇటు సీఎస్‌కే సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్‌ సోకడం కలకర పరుస్తోంది. ప్రస్తుతం అంతా క్వారంటైన్‌ నిబంధనల్ని పాటిస్తూ తమ తమ ప్రాక్టీస్‌ చేస్తున్నా కరోనా వైరస్‌ ఐపీఎల్‌పై ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. సీఎస్‌కే అధికారి ఒకరు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ మా జట్టు సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. ఈరోజు(శనివారం) కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం అతను పూర్తి ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతను ఎక్కడికీ వెళ్లకపోవడమే కాకుండా ప్లేయర్స్‌, సపోర్ట్‌ స్టాఫ్‌ని కూడా కలవలేదు. దాంతో మిగతా వారంతా సేఫ్‌. రేపు మా ప్రాక్టీస్‌ యథావిధిగానే ఉంటుంది’ అని తెలిపారు. 

గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో పలువురు సీఎస్‌కే ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపర్‌ చాహర్‌లకు పాజిటివ్‌ వచ్చింది. వారు కోలుకుని నెగిటివ్‌ వచ్చిన తర్వాత సీఎస్‌కే జట్టులో కలిసి మ్యాచ్‌లు ఆడారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ కూడా గత ఐపీఎల్‌నే దాదాపు తలపిస్తూ ఉండటంతో ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు టెన్షన్‌ టెన్షన్‌గా ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఐపీఎల్‌ నిర్వహణ కష్ట సాధ్యం కావొచ్చు. ఏప్రిల్‌9 నుంచి ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం కానుంది. ఈ సీజన్‌ ఆరంభపు మ్యాచ్‌ ఆర్సీబీ-ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనుంది. 

ఇక్కడ చదవండి: ఐపీఎల్‌ చరిత్రలో ఈ వికెట్‌ కీపర్లు ప్రత్యేకం
హైదరాబాద్‌ను వద్దనుకున్నారు.. ఇప్పుడు తప్పదేమో!

మరిన్ని వార్తలు