CSK VS GT: అందుకే రాయుడిని పక్కకు పెట్టారట..!

15 May, 2022 17:47 IST|Sakshi
Photo Courtesy: IPL

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మే 15) గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్‌ స్లోగా మారుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం (బ్యాటింగ్‌) తీసుకున్నట్లు ఆ జట్టు కెప్టెన్‌ ధోని తెలిపాడు. టాస్‌ గెలిచిన అనంతరం ధోని మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో తీక్షణ, డెవాన్‌ కాన్వే అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడాడు. 

నామమాత్రపు మ్యాచ్‌ కావడంతో ఈ మ్యాచ్‌ కోసం​ భారీ మార్పులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సీనియర్లైన రాబిన్‌ ఊతప్ప, అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రావో, మహీశ్‌ తీక్షణలను బెంచ్‌కు పరిమితం చేసి యువ ఆటగాళ్లు ఎన్‌ జగదీషన్‌, ప్రశాంత్‌ సోలంకీ, మతీష పతిరన, మిచెల్‌ సాంట్నర్‌లను అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపాడు. కొత్తవారికి అవకాశం కల్పించేందుకు సీనియర్లకు రెస్ట్‌ ఇచ్చామని వివరణ ఇచ్చాడు. 

అయితే సీఎస్‌కే జట్టులో ఈ స్థాయి మార్పులు జరగడంపై అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌తో మ్యాచ్‌కు ముందు రోజే అంబటి రాయుడు రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించి ఆ తర్వాత తిరిగి వెనక్కు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాయుడుపై వేటు పడిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మిగతా సీనియర్లు ఊతప్ప, బ్రావోలను ఇంటికి పంపేందుకే (వచ్చే ఏడాది) ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సందేహాలు కలుగుతున్నాయి. మొత్తంగా సీఎస్‌కేలో ఏదో జరుగుతుందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.  

ఇదిలా ఉంటే, గుజరాత్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (49 బంతుల్లో 53; 6 ఫోర్లు, సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. జగదీషన్‌ (33 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ధోని (10 బంతుల్లో 7) మరోసారి దారుణంగా నిరుత్సాహపరిచాడు. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి సీఎస్‌కేను కట్టడి చేశారు. షమీ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ ఖాన్‌, అల్జరీ జోసఫ్‌, సాయికిషోర్‌ తలో వికెట్‌ సాధించారు. 

తుది జట్లు..

సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, శివం దూబే, ఎన్‌ జగదీషన్‌, ఎంఎస్ ధోని(కెప్టెన్), మిచెల్‌ సాండ్నర్‌, ప్రశాంత్‌ సోలంకి, సిమ్రన్‌జిత్ సింగ్, మతీష పతిరన, ముఖేశ్ చౌదరి

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్
చదవండి: సైమండ్స్‌ మృతికి సంతాపం.. నల్ల బ్యాండ్‌లతో బరిలోకి దిగిన గుజరాత్‌, చెన్నై ఆటగాళ్లు..
 

మరిన్ని వార్తలు