IPL 2022 CSK VS MI: పంత్‌ రికార్డును బద్ధలు కొట్టిన తిలక్‌ వర్మ

14 May, 2022 17:30 IST|Sakshi

ముంబై ఇండియన్స్‌ ఆటగాడు, హైదరాబాదీ యంగ్‌ క్రికెటర్‌ తిలక​ వర్మ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 సీజన్‌లో సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గురువారం (మే 12) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 34 పరుగులు చేసిన ఈ 19 ఏళ్ల యువ కెరటం.. తన ఐపీఎల్‌ అరంగ్రేటం సీజన్‌లోనే ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 366 పరుగులు చేసిన తిలక్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ పేరిట ఉన్న ఓ క్రాకింగ్‌ రికార్డును బద్ధలు కొట్టాడు.


ఓ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టీనేజర్‌గా తిలక్‌ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 2017 సీజన్‌లో రిషబ్‌ పంత్‌ 14 మ్యాచ్‌ల్లో 366 పరుగులు చేయగా, తాజాగా తిలక్‌ వర్మ 12 మ్యాచ్‌ల్లోనే పంత్‌ రికార్డును అధిగమించి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో తిలక్‌ వర్మ.. పృథ్వీ షా (16 మ్యాచ్‌ల్లో 353 పరుగులు), సంజూ శాంసన్‌ (13 మ్యాచ్‌ల్లో 339) లను కూడా అధిగమించాడు. 

ఇదిలా ఉంటే, సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌ వర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. సీఎస్‌కే నిర్ధేశించిన 98 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి మరో 31 బంతులు మిగిలుండగానే ఛేదించింది. తిలక్‌ వర్మ ఒక్కడే నిలకడగా రాణించి ముంబై ఇండియన్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.
చదవండి: తెలుగుతేజంపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ ప్రశంసల వర్షం

మరిన్ని వార్తలు