'అతన్ని వదులుకునేందుకు మేం సిద్ధం'

7 Jan, 2021 19:45 IST|Sakshi

చెన్నై:  ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కేదార్ జాదవ్ ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన మినీ వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా జనవరి 21లోపు అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే క్రికెటర్ల జాబితాని టోర్నీలోని అన్ని ఫ్రాంఛైజీలు సమర్పించాలని బీసీసీఐ ఇటీవలే ఆదేశించింది.

దాంతో.. చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి కేదార్ జాదవ్‌ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఐపీఎల్‌ 2021 సీజన్‌కు మొదట 10 జట్లతో లీగ్‌ను ఆడిద్దామని భావించిన బీసీసీఐ మరోసారి ఆలోచించి ఈ సారికి మాత్రం 8 జట్లతోనే లీగ్‌ జరుగుతుందని తెలిపింది.  అయితే 2022 ఐపీఎల్‌ సీజన్‌లో మాత్రం పది జట్లతో లీగ్‌ ఆడించాలని బీసీసీఐ చూస్తుంది. (చదవండి: ఈ మ్యాచ్‌లో నా ఫోకస్‌ మొత్తం అశ్విన్‌పైనే..)

ఐపీఎల్ 2020 సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన కేదార్ జాదవ్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. ఈ 8 మ్యాచ్‌ల్లో కలిపి కనీసం ఒక్క సిక్స్‌ కూడా కేదార్ జాదవ్ కొట్టలేకపోవడం గమనార్హం.ఐపీఎల్ 2018 సీజన్ వేలంలో రూ. 7.8 కోట్లకి కేదార్ జాదవ్‌ని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే 24 పరుగులతో చెన్నై టీమ్‌ని గెలిపించిన కేదార్ జాదవ్.. ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ 2019 సీజన్‌లో మొత్తంగా 162 పరుగులు మాత్రమే చేసిన జాదవ్.. ప్లేఆఫ్ మ్యాచ్‌లకి గాయంతో దూరమయ్యాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కెప్టెన్ ధోనీ వరుసగా అవకాశాలిచ్చినా.. అతను వినియోగించుకోలేకపోయాడు. దాంతో.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ల్లో అతనిపై వేటు పడింది.

మొత్తంగా పేలవ ఫామ్, ఫిట్‌నెస్‌లేమితో నిరాశపరుస్తున్న కేదార్ జాదవ్‌ని వేలంలోకి వదులుకునేందుకు సీఎస్‌కే సిద్ధమైనట్లు తెలుస్తుంది. అంతేగాక కేదార్ జాదవ్‌తో పాటు పీయూష్‌ చావ్లా, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, సురేశ్ రైనాలను కూడా వదులుకోవాలని చెన్నై భావిస్తోంది. కాగా ఐపీఎల్ 2020 సీజన్‌ ప్రారంభానికి ముందేవ్యక్తిగత కారణాలతో రైనా, హర్భజన్ సింగ్ తప్పుకున్న విషయం తెలిసిందే.(చదవండి: ఏబీ జెర్సీ ధరించాడు.. అందుకే అలా పడ్డాడు)

మరిన్ని వార్తలు