CWG 2022-Amit Panghal: మరో పసిడి పంచ్‌.. బాక్సింగ్‌లో భారత్‌కు రెండో స్వర్ణం

7 Aug, 2022 16:38 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత బాక్సర్లు రెచ్చిపోతున్నారు. పురుషుల ఫెదర్‌వెయిట్‌ 57 కేజీల విభాగంలో మహ్మద్‌ హుస్సాముద్దీన్‌, పురుషుల 67 కేజీల వెల్టర్‌వెయిట్‌ విభాగంలో రోహిత్‌ టోకాస్‌లు ఇదివరకే కాంస్య పతకాలు గెలువగా.. పదో రోజు క్రీడల ఆరంభంలోనే మహిళల 48 కేజీల మినిమమ్‌ వెయిట్‌ విభాగంలో నీతూ గంగాస్‌ స్వర్ణంతో మెరిసింది. నీతూ పసిడి గెలిచిన నిమిషాల వ్యవధిలోనే భారత్‌ బాక్సింగ్‌లో మరో స్వర్ణం సాధించింది.

పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్‌ పంగాల్‌ పసిడి పంచ్‌ విసిరాడు. అమిత్‌ ఫైనల్లో ఇంగ్లండ్ బాక్సర్‌ కియరన్ మెక్‌డొనాల్డ్‌ను 5-0 తేడా మట్టికరిపించి భారత్ స్వర్ణాల సంఖ్యను 15కు, ఓవరాల్‌ పతకాల సంఖ్యను 43కు (15 స్వర్ణాలు, 11 రజతాలు, 17 కాంస్యాలు) పెంచాడు. ఇదే రోజే భారత్‌ మరో పతకం కూడా సాధించింది. మహిళల హాకీలో భారత్‌.. న్యూజిలాండ్‌పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం పతకం సొంతం చేసుకుంది. 
చదవండి: పట్టు వదలని భారత మహిళా హాకీ జట్టు.. సెమీస్‌లో రిఫరీ దెబ్బకొట్టినా కాంస్యం సొంతం

మరిన్ని వార్తలు