Commonwealth Games 2022 Day 7: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత పురుషుల హాకీ జట్టు.. బాక్సింగ్‌లో అరడజను పతకాలు ఖరారు

4 Aug, 2022 21:30 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్‌ 18 పతకాలు (5 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు) సాధించగా.. బాక్సింగ్‌లో మరో అరడజను పతకాలు ఖాతాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్ అహ్లవత్, మహిళల 60 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియ, పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగల్‌ ఇవాళ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేశారు. మరోవైపు పురుషుల హాకీలో భారత జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-1 తేడాతో గెలుపొందింది. 

స్క్వాష్‌లో భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. మెన్స్ డబుల్స్‌లో సెంథిల్ కుమార్-అభయ్ సింగ్ జోడీ, మహిళల డబుల్స్‌లో అనాహత్ సింగ్, సునన్య కురువిల్లా జోడీ తొలి రౌండ్లలో విజయాలు సాధించి ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. ఇవే కాకుండా హ్యామర్ త్రో ఈవెంట్‌లో మంజు బాల ఫైనల్‌కు అర్హత సాధించగా.. స్టార్‌ స్ప్రింటర్ హిమా దాస్ 200 మీటర్ల విభాగంలో సెమీస్‌కి అర్హత సాధించింది. బ్యాడ్మింటన్‌లో స్టార్‌ షట్లర్లు సింధు, శ్రీకాంత్‌ ప్రీ క్వార్టర్స్‌కు చేరారు. 
చదవండి: స్వర్ణం లక్ష్యంగా దూసుకుపోతున్న సింధు, శ్రీకాంత్‌
 

మరిన్ని వార్తలు