Katherine Brunt CWG 2022: ఇంగ్లండ్‌ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ

7 Aug, 2022 09:16 IST|Sakshi

ఇంగ్లండ్‌ మహిళా ఫాస్ట్‌ బౌలర్‌ కేథరిన్‌ బ్రంట్‌కు ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్‌ సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించి ఐసీసీ నియమావళి లెవెల్‌-1 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ కేథరిన్‌ను హెచ్చరించడమే గాక మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించింది. ఇక డిసిప్లీనరి యాక్ట్‌ కింద ఒక పాయింట్‌ కోత విధించింది.  ఏడాది కాలంలో కేథరిన్‌ బ్రంట్‌ ఐసీసీ నిబంధన ఉల్లఘించడం ఇది రెండోసారి. ఇప్పటికే రెండు డీమెరిట్‌ పాయింట్లు ఉండడంతో.. మరోసారి నిబంధన ఉల్లంఘిస్తే మాత్రం ఒక మ్యాచ్‌ నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది.  

విషయంలోకి వెళితే.. శనివారం ఇంగ్లండ్‌, టీమిండియా మహిళల మధ్య కామన్‌వెల్త్‌ గేమ్స్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. భారత బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ కేథరిన్‌ బ్రంట్‌ వేసింది. దీప్తి శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్‌ విడిచిపెట్టడంతో కేథరిన్‌ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కోపంగా అరిచింది. ఆమె వ్యాఖ్యలు స్టంప్‌ మైక్‌లో రికార్డ్‌ అయ్యాయి. దీంతో మ్యాచ్‌ అనంతరం  ఐసీసీ నిబంధనల ప్రకారం ఆర్టికల్‌ 2.3 నిబంధన ఉల్లఘించిన కేథరిన్‌ బ్రంట్‌కు హెచ్చరిస్తూ ఒక డీమెరిట్‌ పాయింట్‌ విధిస్తున్నట్లు మ్యాచ్‌ రిఫరీ స్పష్టం చేశారు. 

తొలిసారిగా కామన్వెల్త్‌ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్‌ప్రీత్‌ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుపై భారత్‌ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్‌ (31 బంతుల్లో 44 నాటౌట్‌; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్‌ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది.

ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్‌ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్‌ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్‌ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్‌ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది.  

చదవండి: Commonwealth Games 2022: క్రికెట్‌లో కనకంపై గురి

మంధాన ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు

మరిన్ని వార్తలు