CWG 2022: భారత్‌ ఖాతాలో ఐదో స్వర్ణం.. ఎందులో అంటే..?

2 Aug, 2022 21:13 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఐదో రోజు మహిళల లాన్ బౌల్స్‌లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత టీమ్‌‌.. తాజాగా పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఈవెంట్‌లోనూ బంగారు పతకం కైవసం చేసుకుంది. సింగపూర్‌తో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్‌ 3-1 తేడాతో విజయం సాధించి టైటిల్‌ నిలబెట్టుకుంది. తద్వారా భారత్‌ ఖాతాలో ఐదో స్వర్ణం, ఓవరాల్‌గా 11వ పతకం చేరింది. 

తొలి మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్- జీ సాథియన్ జోడి 13-11, 1-7, 11-5 తేడాతో యంగ్ ఇజాక్ క్వెక్-యో ఎన్ కోన్ పంగ్‌ ద్వయంపై విజయం సాధించి భారత ఆధిక్యాన్ని 1-0 పెంచగా.. ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు శరత్ కమాల్.. క్లెరెన్స్ చ్యూ చేతిలో 7-11, 14-12, 3-11, 9-11 తేడాతో ఓడిపోయాడు.

అనంతరం జీ సాథియన్.. కొన్ పంగ్‌పై 12-10, 7-11, 11-7, 11-4 తేడాతో గెలుపొంది భారత్‌కు 2-1 ఆధిక్యం అందించగా.. నాలుగో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్.. జెడ్‌ చ్యూపై 11-8, 11-5,11-6 వరుస సెట్లలో గెలుపొంది భారత్‌కు గోల్డ్ మెడల్ ఖరారు చేశాడు.
చదవండి: CWG 2022: చరిత్ర సృష్టించిన భారత్‌.. స్వర్ణం నెగ్గిన వుమెన్స్‌ టీమ్‌

మరిన్ని వార్తలు