CWG 2022: నన్ను క్షమించండి.. మహిళా రెజ్లర్‌ కన్నీటి పర్యంతం.. ప్రధాని మోదీ ట్వీట్‌!

7 Aug, 2022 12:41 IST|Sakshi
కన్నీటి పర్యంతమైన పూజా గెహ్లోత్‌(PC: ANI)

Commonwealth Games 2022: భారత మహిళా రెజ్లర్‌ పూజా గెహ్లోత్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పూజ సాధించిన పతకం ఆనందోత్సవాలకు కారణమవుతుందన్న ఆయన.. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆమెను ఓదార్చారు. కాగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా సాగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో పూజా గెహ్లోత్‌ కాంస్య పతకం సాధించింది.

మహిళల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ (50 కేజీల) విభాగంలో కెనడాకు చెందిన మాడిసన్‌ బియాంక పార్క్స్ తో శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో పూజా ఓటమి పాలైంది. ఈ క్రమంలో స్కాట్లాండ్‌ రెజ్లర్‌ క్రిస్టెలీ లెమోఫాక్‌ లిచిద్జియోతో ప్లే ఆఫ్‌లో తలపడింది. ఇందులో భాంగా 12-2తో విజయం సాధించి కాంస్య పతకం గెలిచింది. అయితే, సెమీ ఫైనల్‌లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన పూజా.. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది.   

నన్ను క్షమించండి!
తాను కాంస్య పతకానికే పరిమితమైనందుకు క్షమించాలంటూ కన్నీటి పర్యంతమైంది. ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై జాతీయ గీతం వినిపించలేకపోయానంటూ భారతావనిని క్షమాపణలు కోరింది. ఈ మేరకు పూజా గెహ్లోత్‌ మాట్లాడుతూ.. ‘‘నేను సెమీ ఫైనల్‌ చేరుకున్నాను. కానీ ఓడిపోయాను. నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. జాతీయ గీతం వినిపించాలనుకున్నా..

కానీ అలా చేయలేకపోయాను.. నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. వాటిని సరిదిద్దుకుంటాను’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా వైరల్‌ అవుతోంది. 

ఈ వీడియోపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ పూజను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘పూజా.. నీ పతకం సెలబ్రేషన్స్‌కు కారణమవుతుంది. క్షమాపణకు కాదు! నీ జీవిత ప్రయాణం మాకు ఆదర్శం. నీ విజయం మాకు సంతోషాన్నిచ్చింది. మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలి.. భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోవాలి’’ అంటూ పూజాకు అండగా నిలిచారు.


నవీన్‌, రవి దహియా, వినేశ్‌ ఫొగట్‌

రెజ్లర్లు అదరగొట్టారు..
కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో భారత రెజ్లర్‌ అద్భుత విజయాలు అందుకున్నారు. ఈ క్రీడా విభాగంలో భారత్‌కు మొత్తంగా ఆరు స్వర్ణాలు, ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు లభించాయి. స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, దీపక్‌ పూనియా, సాక్షి మలిక్‌, వినేశ్‌ ఫొగట్‌, రవి దహియా, నవీన్‌ స్వర్ణ పతకాలతో మెరవగా... అన్షు మలిక్‌ రజతం... దివ్య కక్రాన్, మోహిత్‌ గ్రెవాల్‌, పూజా గెహ్లోత్‌, పూజా సిహాగ్‌, దీపక్‌ నెహ్రా కాంస్య పతకాలు గెలిచారు. 

చదవండి: Rohit Sharma-Rishabh Pant: పంత్‌ ప్రవర్తనపై రోహిత్‌ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్‌ 
Rohit Sharma: ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్‌.. ఇప్పుడు హీరో!

మరిన్ని వార్తలు