Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన రికార్డు! రోహిత్‌ శర్మ తర్వాత ఆమే!

4 Aug, 2022 16:50 IST|Sakshi

Commonwealth Games 2022: భారత మహిళా బ్యాటర్‌ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. టీ20 ఫార్మాట్‌లో భారత్‌ తరఫున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు(2004) చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్‌ ఇప్పటి వరకు భారత ఓపెనర్‌గా 96 ఇన్నింగ్స్‌లో 2973 పరుగులు చేశాడు. 

ఇక 79 ఇన్నింగ్స్‌లో 2 వేల పరుగుల మార్కును అందుకున్న మంధాన.. రోహిత్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో భాగంగా బార్బడోస్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో 5 పరుగులు చేసి పెవిలియన్‌ చేరిన స్మృతి మంధాన.. 2004 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మహిళా జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, కేఎల్‌ రాహుల్‌లను మంధాన అధిగమించింది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. భారత బౌలర్లు చెలరేగడంతో 62 పరుగులకే బార్బడోస్‌ కథ ముగిసింది.

ఏకంగా వంద పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకం సాధించే దిశగా హర్మన్‌ప్రీత్‌కౌర్‌ బృందం పయనిస్తోంది. కాగా స్మృతి మంధాన 2013లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో.. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసింది.

టీమిండియా తరఫున ఓపెనర్లుగా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-5 వీరే!
1. రోహిత్‌ శర్మ-2973 పరుగులు
2. స్మృతి మంధాన- 2004 పరుగులు
3. శిఖర్‌ ధావన్‌- 1759 పరుగులు
4. మిథాలీ రాజ్‌- 1407 పరుగులు
5. కేఎల్‌ రాహుల్‌-1392 పరుగులు
చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..!

మరిన్ని వార్తలు