CWG 2022 IND VS PAK: ధోని రికార్డు బద్దలు కొట్టిన హర్మన్‌ ప్రీత్

31 Jul, 2022 20:49 IST|Sakshi

కామన్వెల్త్ గేమ్స్ 2022 మహిళల క్రికెట్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్ కౌర్‌ నేతృత్వంలోని టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో హర్మన్‌ పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా (పురుషులు, మహిళల క్రికెట్‌లో కలిపి) సరికొత్త రికార్డు (42 విజయాలు) నెలకొల్పింది. ఈ మ్యాచ్‌కు ముందు టీ20ల్లో టీమిండియా తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోని (41 విజయాలు) ఉండేవాడు.

తాజా విజయంతో హర్మన్‌.. ధోని రికార్డును బద్దలు కొట్టి పొట్టి ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌గా అవతరించింది. ఈ జాబితాలో మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  30 విజయాలతో మూడో స్థానంలో ఉండగా.. ప్రస్తుత సారథి రోహిత్ శర్మ 27 విజయాలతో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా భారత్‌ మరో రికార్డ్‌ను కూడా బద్దలు కొట్టింది.  పాక్‌ నిర్ధేశించిన 99 లక్ష్యాన్ని మరో 38 బంతులుండగానే ఛేదించిన టీమిండియా.. ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ల్లో బంతుల పరంగా అతి పెద్ద విజయం నమోదు చేసింది. ఇంతకుముందు 2018లో 23 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించిన భారత్‌.. ఈ మ్యాచ్‌తో ఆ రికార్డును చెరిపి వేసింది. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్‌ మెరుపు వేగంతో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి భారత్‌ మరో 38 బంతులుండగానే (11.4 ఓవర్లలోనే) లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది.  
చదవండి: మంధాన విధ్వంసం.. పాక్‌ను మట్టికరిపించిన భారత్‌

మరిన్ని వార్తలు