CWG 2022: పతకం దిశగా దూసుకుపోతున్న భారత అమ్మాయిలు

3 Aug, 2022 20:41 IST|Sakshi

కామన్‌వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు పతకం దిశగా దూసుకుపోతుంది. క్వార్టర్ ఫైనల్‌లో భారత అమ్మాయిలు కెనడాపై 3-2 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టారు. ఈ విజయంతో భారత్‌ ఆరు పాయిం‍ట్లతో గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచింది. భారత్ గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఘనాపై 5-0 తేడాతో గ్రాండ్‌ విక్టరీ సాధించిన భారత్‌.. ఆతర్వాతి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1 తేడాతో గెలుపొం‍దింది. 

అయితే ఇంగ్లండ్‌తో తదుపరి జరిగిన మ్యాచ్‌లో 1-3 తేడాతో ఓటమిపాలవ్వడంతో భారత జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. అనంతరం కెనడాతో మ్యాచ్‌లో పుంజుకున్న భారత అమ్మాయిలు.. అద్భుతంగా రాణించి సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్నారు. సలీమా టెటె, నవనీత్‌ కౌర్‌, లాల్రెమ్సియామి తలో గోల్‌ సాధించారు. ఈ విజయంతో భారత్‌.. కెనడాతో సమానంగా ఆరు పాయింట్లు సాధించినప్పటికీ, ఎక్కువ గోల్స్‌ చేసిన కారణంగా కెనడా గ్రూప్‌-ఏలో అగ్ర జట్టు హోదాలో సెమీస్‌లో అడుగుపెట్టింది.

ఇదిలా ఉంటే, ఆరో రోజు లవ్‌ప్రీత్‌ సింగ్‌ కాంస్యం సాధించడంతో భారత్‌ పతకాల సంఖ్య 14కు చేరింది. మరో 3 పతకాలు భారత జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్‌ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన తులికా మాన్‌ సిల్వర్‌ మెడల్‌పై కర్చీఫ్‌ వేయగా.. పురుషుల బాక్సింగ్‌ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్‌ ముహమ్మద్‌ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. 
చదవండి: CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు

మరిన్ని వార్తలు