ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు

8 Dec, 2021 15:53 IST|Sakshi

David Warner Nominated For ICC Player Of The Month Award: 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌' అవార్డుకు గాను నవంబర్‌ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాక్‌ ఆటగాడు ఆబిద్ అలీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ నిలిచారు. పురుషుల విభాగంలో ఈ ముగ్గురు క్రికెటర్లు నామినీస్‌ కాగా.. మహిళల కేటగిరీలో పాక్‌ స్పిన్నర్‌ ఆనమ్ అమిన్, బంగ్లా బౌలర్‌ నహీదా అక్తర్, విండీస్​ ఆల్​రౌండర్ హలే మథ్యూస్ ఉన్నారు.

వార్నర్.. నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 69.66 సగటుతో 209 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలువగా.. అదే టోర్నీలో సౌథీ 7 వికెట్లతో రాణించి తన జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. డబ్ల్యూటీసీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో సైతం సౌథీ 8 వికెట్లు సత్తా చాటాడు. ఈ అవార్డు రేసులో ఉన్న పాక్‌ ఓపెనర్ ఆబిద్ అలీ బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 133, 91 పరుగులతో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు.

ఇదిలా ఉంటే, నవంబర్ నెలలో టీమిండియా ఆటగాళ్లు తక్కువ మ్యాచ్‌లు ఆడటం.. అందులో పెద్దగా రాణించకపోవడంతో ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. కాగా, ఐసీసీ.. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెలా ఈ అవార్డును అందజేస్తున్న సంగతి తెలిసిందే. 
చదవండి: IND Vs SA: వాళ్లిద్దరినీ త్వరగా ఔట్‌ చేస్తే.. భారత్‌దే విజయం!
 

మరిన్ని వార్తలు