వార్నర్‌ నయా రికార్డు.. కోహ్లి రికార్డు బ్రేక్‌

18 Oct, 2020 22:03 IST|Sakshi

అబుదాబి: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ నయా రికార్డును లిఖించాడు. ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ ఐదువేల ఐపీఎల్‌ పరుగుల మార్కును చేరాడు. ఫలితంగా ఈ మార్కు చేరిన తొలి విదేశీ ఆటగాడిగా వార్నర్‌ రికార్డు నమోదు చేశాడు. అదే సమయంలో వేగవంతంగా ఐదువేల ఐపీఎల్‌ పరుగులు సాధించిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇది వార్నర్‌కు 135వ ఐపీఎల్‌ మ్యాచ్‌. కాగా, ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 157 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగులు సాధించాడు.

అయితే దాన్ని వార్నర్‌ బద్ధలు కొట్టాడు. కాగా, ఐదువేల పరుగులు సాధించిన నాల్గో బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ నిలిచాడు. ఈ జాబితాలో  కోహ్లి(5,759 పరుగులు 186 మ్యాచ్‌ల్లో), సురేశ్‌ రైనా(5,468 పరుగులు183 మ్యాచ్‌ల్లో), రోహిత్‌ శర్మ(5,149 పరుగులు 196 మ్యాచ్‌ల్లో)ల తర్వాత స్థానంలో వార్నర్‌ నిలిచాడు. ఐపీఎల్‌లో ఐదువేల పరుగులు సాధించిన విదేశీ ఆటగాళ్లలో వార్నర్‌ ప్రస్తుతానికి ఒక్కడే కాగా, ఆ మార్కును చేరడానికి మరో విదేశీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ లైన్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ డివిలియర్స్‌ 163 మ్యాచ్‌ల్లో 4,680 పరుగులతో ఉన్నాడు.(మరో సూపర్‌ థ్రిల్లర్‌.. కేకేఆర్‌ విన్నర్‌)

మరిన్ని వార్తలు