Davis Cup: వరల్డ్‌ గ్రూప్‌–2కు పడిపోయిన భారత్‌

5 Feb, 2023 05:18 IST|Sakshi

డెన్మార్క్‌ చేతిలో పరాజయం

హిలెరాడ్‌ (డెన్మార్క్‌): ప్రపంచ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ డేవిస్‌ కప్‌లో 2019లో కొత్త ఫార్మాట్‌ మొదలుపెట్టాక... భారత జట్టు తొలిసారి వరల్డ్‌ గ్రూప్‌–2కు పడిపోయింది. డెన్మార్క్‌ జట్టుతో ఆదివారం ముగిసిన వరల్డ్‌ గ్రూప్‌–1 ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–3 తేడాతో ఓడిపోయింది. తొలి రోజు రెండో సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ 4–6, 6–3, 6–4తో ఆగస్ట్‌ హోమ్‌గ్రెన్‌ను ఓడించడంతో భారత్‌ స్కోరున 1–1తో సమం చేసింది.

అయితే రెండో రోజు డబుల్స్‌ మ్యాచ్‌లో హోల్గర్‌ రూన్‌–ఇంగిల్డ్‌సెన్‌ జోడీ 6–2, 6–4తో 65 నిమిషాల్లో రోహన్‌ బోపన్న–యూకీ బాంబ్రీ ద్వయంపై గెలిచి డెన్మార్క్‌కు 2–1తో ఆధిక్యం అందించింది. నాలుగో మ్యాచ్‌లో హోల్గర్‌ రూన్‌ 7–5, 6–3తో సుమిత్‌ నగాల్‌పై నెగ్గడంతో డెన్మార్క్‌ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో... నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో భారత ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ 6–4, 7–6 (7/1)తో ఎల్మెర్‌ మోలెర్‌ను ఓడించాడు.  

మరిన్ని వార్తలు