IPL 2023: సౌరవ్‌ గంగూలీకి కీలక బాధ్యతలు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెట్ డైరెక్టర్‌గా దాదా!

3 Jan, 2023 16:46 IST|Sakshi

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తిరిగి మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గతేడాది ఆక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్ష పదవి నుండి వైదొలిగిన దాదా.. ఇప్పటికే యూఏఈ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు.

కాగా దుబాయ్ క్యాపిటల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీలను ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ నుంచి  ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా సౌరవ్‌ తిరిగి బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే అతడితో ఢిల్లీ ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిగింది. గతంలో క్రికెట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన దాదాకు ఢిల్లీ యాజమాన్యంతో మంచి సంబంధం ఉంది.

కాబట్టి మళ్లీ అతడు తన బాధ్యతలను తిరిగి చేపట్టునున్నాడు అని ఐపీఎల్‌ వర్గాలు పీటీఐతో వెల్లడించాయి. ఇక టీమిండియా స్టార్‌ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.

అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌కు దూరం కావడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. ఒక వేళ పంత్‌ దూరమైతే  ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
చదవండి: టీమిండియా హెడ్‌ కోచ్‌గా లక్ష్మణ్‌.. ద్రవిడ్‌కు త్వరలోనే గుడ్‌బై!

>
మరిన్ని వార్తలు