Deepa malik: ఇది ఆరంభం మాత్రమే: దీపా మలిక్‌

7 Sep, 2021 07:31 IST|Sakshi

టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. తొమ్మిది క్రీడాంశాల్లో కలిపి మొత్తం 54 మంది క్రీడాకారులతో టోక్యోకు బయలుదేరినపుడు ఈసారి మనం చరిత్ర సృష్టిస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. 1968లో తొలిసారి పారాలింపిక్స్‌లో భారత్‌ అరంగేట్రం చేశాక 2016 రియో పారాలింపిక్స్‌ వరకు మనం మొత్తం 12 పతకాలు గెలిచాం. అయితే ఈసారి మనం ఏకంగా 19 పతకాలు నెగ్గడం... 162 దేశాలు పాల్గొన్న ఈ దివ్యాంగుల విశ్వ క్రీడల్లో 24వ స్థానంలో నిలువడం ఆనందం కలిగించింది.

భారత క్రీడాకారులు పతకాలు గెలిచే క్రమంలో ప్రపంచ, పారాలింపిక్, ఆసియా రికార్డులు సృష్టించడం నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. మరికొందరు పతకాలను త్రుటిలో చేజార్చుకున్నా వారి ప్రదర్శనను ప్రశంసించాల్సిందే.  స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుండి నడిపించడంతో దేశం మొత్తం మమ్మల్ని అనుసరించి ఆదరించింది. పారాలింపిక్స్‌కు బయలుదేరేముందు ఆయన మాతో రెండు గంటలపాటు మాట్లాడి మాలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. దేశానికి చెందిన అత్యున్నత నాయకుడి నుంచి ఈ తరహా మద్దతు లభిస్తే ఏ క్రీడాకారుడి కెరీర్‌ అయినా సాఫీగా సాగిపోతుంది. ఈసారి పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల పంట పండించడం ఎలా సాధ్యమైందని చాలాసార్లు నన్ను అడిగారు.

కేంద్ర ప్రభుత్వం, భారత పారాలింపిక్‌ కమిటీ, ప్రభుత్వేతర సంస్థలు పారా స్పోర్ట్స్‌కు మద్దతు నిలవడంవల్లే ఈసారి మేము అత్యధిక పతకాలు గెలవగలిగాం. 2016 రియో పారాలింపిక్స్‌లో నాలుగు పతకాలు గెలిచిన తర్వాత పారా స్పోర్ట్స్‌ను ప్రత్యేక దృష్టి కోణంలో చూడటం మొదలైంది. వైకల్యం ఉన్నా ఆటల ద్వారా అత్యున్నత వేదికపై సత్తా చాటుకునే అవకాశం ఉందని, తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవచ్చని దివ్యాంగులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవైపు కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రదర్శనతో భారత్‌లో పారాలింపిక్స్‌కు సంబంధించి కొత్త శకం మొదలైంది. టోక్యో కేవలం ఆరంభం మాత్రమే!

చదవండి: Tokyo Paralympics 2021: కలెక్టర్‌ సాబ్‌ కథ ఇదీ..

Viral Video: ఊహించని ట్విస్ట్‌.. గ్రౌండ్‌లోకి పోలీసుల రంగప్రవేశం, భయంతో ప్లేయర్స్‌..

మరిన్ని వార్తలు