గబ్బర్‌ ఉన్నాడుగా.. ఇక వేరేవాళ్లు ఎందుకు?

21 May, 2021 20:04 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా జూలైలో  శ్రీలంక పర్యటనకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ.. కెప్టెన్సీ ఎవరికి అప్పగించాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. శ్రేయాస్‌ అయ్యర్‌ జట్టులో ఉండి ఉంటే కచ్చితంగా కెప్టెన్‌ అయ్యేవాడు. కానీ అతను గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమవడంతో కెప్టెన్సీ రేసుకు శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ధావన్‌కు కెప్టెన్సీ ఇవ్వాలంటూ అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు మద్దతు ఇచ్చారు. తాజాగా సీఎస్‌కే బౌలర్‌ దీపక్‌ చహర్‌ గబ్బర్‌కే ఓటు వేశాడు. ధావన్‌కు కెప్టెన్సీలో మంచి అనుభవముందని పేర్కొన్నాడు.  

''కెప్టెన్‌గా శిఖర్ భాయ్ గుడ్ ఛాయిస్. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా అతను టీమిండియాకి ఆడుతున్నాడు. అలానే టీమ్‌లో ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్ కూడా. కాబట్టి.. శిఖర్ ధావన్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేయడమే సమంజసం. సీనియర్ ప్లేయర్ కావడంతో ఆటగాళ్లు కూడా అతడ్ని గౌరవిస్తారు. కెప్టెన్‌‌ని ఆటగాళ్లు గౌరవించాలి. ఇక ధావన్‌కు గతంలో ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.''అని చహర్ చెప్పుకొచ్చాడు.

ఇక దీపక్‌ చహర్‌ శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్టులో తనకు చోటు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా దీపక్‌ చహర్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కు తరపున దుమ్మురేపాడు. సీఎస్‌కేకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 11 వికెట్లతో మెరిశాడు.  ఇక బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా రెండో జట్టు జులై 13 నుంచి 27 వరకూ లంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. మరోవైపు జూన్ 2న ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనున్న కోహ్లీ సేన ముందు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.
చదవండి: జడేజా పేసర్‌ అయితే బాగుండు.. మాకు చాన్స్‌ వచ్చేది

శ్రీలంక పర్యటనకు కోచ్‌గా ద్రవిడ్‌

మరిన్ని వార్తలు