సన్‌రైజర్స్‌ బ్యాట్‌ ఝుళిపిస్తేనే..

8 Nov, 2020 21:25 IST|Sakshi
ధావన్‌-అయ్యర్‌(ఫోటో సోర్స్‌: పీటీఐ)

అబుదాబి:  ఐపీఎల్‌ నాకౌట్‌ సమరంలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-2 లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 190 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శిఖర్‌ ధావన్‌(78; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు), స్టోయినిస్‌(38; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌)లు మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యంతో పాటు హెట్‌మెయిర్‌( 42 నాటౌట్‌; 22 బంతుల్లో 4 ఫోర్లు,  1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించాడు. ఇక అయ్యర్‌(21; 20 బంతుల్లో 1 ఫోర్‌), లు ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ను స్టోయినిస్‌, ధావన్‌లు ఆరంభించారు. పృథ్వీ షాకు ఉద్వాసన పలకడంతో ధావన్‌తో కలిసి స్టోయినిస్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 

వీరిద్దరూ ఆదినుంచి బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్టోయినిస్‌-ధావన్‌లు పోటీ పరుగులు చేయడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి ఢిల్లీ 65 పరుగులు చేసింది. కాగా, రషీద్‌ ఖాన్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ రెండో బంతికి స్టోయినిస్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో ఢిల్లీ 86 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం ధావన్‌-అయ్యర్‌ల జోడి రన్‌రేట్‌ కాపాడుకుండా స్టైక్‌ రొటేట్‌ చేసింది. 14 ఓవర్‌లో అయ్యర్‌ను హోల్డర్‌ ఔట్‌ చేయడంతో ఢిల్లీ 126 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. అనంతరం ధావన్‌కు హెట్‌మెయిర్‌ జతకలిసి ఇన్నింగ్స్‌లో మరొకసారి దూకుడు పెంచాడు. ఈ జోడి 30 బంతుల్లో 52 పరుగులు చేసింది. సందీప్‌ శర్మ వేసిన 19 ఓవర్‌ మూడో బంతికి ధావన్‌ ఔట్‌ అయ్యాడు. ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ స్లాగ్‌ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీని రెండొందల పరుగుల మార్కును చేరకుండా నివారించింది. చివరి రెండు ఓవర్లలో వికెట్‌ సాధించిన సన్‌రైజర్స్‌ 13 పరుగులే ఇచ్చింది.

>
మరిన్ని వార్తలు