ఐపీఎల్ 2020:‌ అయ్యర్‌కు భారీ జరిమానా

30 Sep, 2020 15:56 IST|Sakshi

న్యూఢిల్లీ: తొలి రెండు మ్యాచుల్లో అద్భుత ఆటతీరుతో విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. కెప్టెన్‌ వార్నర్‌ (33 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌ స్టో (48 బంతుల్లో 53; 2 ఫోర్లు, 1 సిక్స్‌), విలియమ్సన్‌ (26 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 162 పరుగులు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఢిల్లీ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌ (3/14), భువనేశ్వర్‌ (25/2), నటరాజన్‌ (29/1) మెరుగైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని 147 పరుగులకు కట్టడి చేశారు. 
(చదవండి: ‘నటరాజన్‌.. నిప్పులు చెరిగే బంతులవి’)

ఇక గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలైన ఢిల్లీ జట్టు కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు స్లో ఓవర్‌ రేటు కారణంగా భారీ జరిమానా పడింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా అయ్యర్‌కు రూ.12 లక్షలు జరిమానా విధించినట్టు ఐపీఎల్‌ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతకుముందు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఇదే మొత్తంలో జరిమానా పడింది. కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు కారణంగా విరాట్‌కు ఫైన్‌ తప్పలేదు. గత గురువారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కింగ్స్‌ పంజాబ్‌ విసిరిన 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో బెంగుళూరు109 పరుగులకు ఆలౌట్‌ అయింది.
(చదవండి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మొదటి విజయం)

మరిన్ని వార్తలు