ఐదో ప్లేయర్‌గా గబ్బర్‌..

20 Oct, 2020 21:41 IST|Sakshi

దుబాయ్‌:  ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్‌ రికార్డు నెలకొల్పిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. మరో ఘనతను కూడా నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఐదువేల పరుగుల మార్కును పూర్తి చేసుకున్నాడు. మంగళవారం కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ధావన్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. ఫలితంగా ఐపీఎల్‌లో ఐదువేల పరుగులు సాధించిన ఐదో ప్లేయర్‌గా గబ్బర్‌ నిలిచాడు. ఈ జాబితాలో  విరాట్‌ కోహ్లి(5,759) ముందు వరుసలో ఉండగా, సురేశ్‌ రైనా(5,368), రోహిత్‌ శర్మ(5,158), డేవిడ్‌ వార్నర్‌(5,037)లు ఆ తర్వాత వరుస స్థానాల్లో ఉన్నారు. (శిఖర్‌ మళ్లీ దంచేశాడు..)

తాజాగా ఆ జాబితాలో ధావన్‌ కూడా చేరిపోయాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐదు వేల పరుగులు చేరడానికి 62 పరుగుల దూరంలో ధావన్‌ ఉన్నాడు. మ్యాచ్‌లో 106 పరుగులు  సాధించడం ద్వారా ధావన్‌ ఐపీఎల్‌ పరుగులు 5,043కు చేరాయి. ఈ సీజన్‌లో సీఎస్‌కేతో జరిగిన గత మ్యాచ్‌లో కూడా ధావన్‌ సెంచరీ సాధించాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు, 1సిక్స్‌తో అజేయంగా 101 పరుగులు నమోదు చేశాడు. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ధావన్‌ 69 నాటౌట్‌, 57 పరుగులు సాధించాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో 50కి పైగా పరుగుల్ని ధావన్‌ సాధించడం విశేషం. (మనం గెలవగలం.. మనం గెలుస్తాం: జడేజా)

మరిన్ని వార్తలు