ఎంఎస్‌ ధోని తొలిసారి..

1 Nov, 2020 20:24 IST|Sakshi
ఎంఎస్‌ ధోని(ఫోటో సోర్స్‌; సీఎస్‌కే ట్విట్టర్‌)

అబుదాబి:  ఈ ఐపీఎల్‌ సీజన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు విజయాలతో ముగించింది. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ ఆశలకు సీఎస్‌కే గండికొట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన సీఎస్‌కే టోర్నీ నుంచి గౌరవంగా నిష్క్రమించింది. ఇదిలా ఉంచితే, ఈ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ 14 మ్యాచ్‌లకు గాను 12 ఇన్నింగ్స్‌లు ఆడి 199 పరుగులు చేశాడు. ఇది ధోని నుంచి వచ్చిన నిరాశజనకమైన ప్రదర్శన. అదే సమయంలో ఈ సీజన్‌లో ధోని ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేదు.

ఇలా తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకుండా ఒక సీజన్‌ను ముగించడం ఇదే తొలిసారి.ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌ను తాను ఆడతాననే విషయాన్ని ధోని స్పష్టం చేశాడు. టాస్‌ సమయంలో అతనికి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా తాను ఇంకా ఆడతాననే సంకేతాలిచ్చాడు. ‘ యెల్లో జెర్సీలో ఇది మీ చివరి మ్యాచ్‌ కావొచ్చా?’ అని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా కాదు అనే సమాధానాన్ని ధోని ఇచ్చాడు. ఈ సీజన్‌లో ధోని ఆకట్టుకోలేనంత మాత్రాన అతన్ని తక్కువగా అంచనా వేయొద్దని శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కార పేర్కొన్నాడు. ఏదో ఒక్క సీజన్‌ ప్రదర్శనతో ధోనిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదన్నాడు. అతను చాలా స్ట్రాంగ్‌ ప్లేయర్‌ అని, వచ్చే సీజన్‌లో ధోని నుంచి మంచి ఇన్నింగ్స్‌లు వస్తాయని ఆశిస్తున్నానన్నాడు. 

మరిన్ని వార్తలు