సీఎస్‌కే ఆటగాళ్లపై ధోనీ తీవ్ర అసంతృప్తి

11 Oct, 2020 12:12 IST|Sakshi

దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్స్‌ పూర్తిగా విఫలమయ్యారు. మ్యాచ్‌ అనంతరం ధోని మాట్లాడుతూ జట్టు ఆటతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'మా జట్టులో బ్యాటింగ్‌ సమస్య ముందు నుంచి ఉంది. ఈ మ్యాచ్‌ ద్వారా అది మళ్లీ స్పష్టం అయింది. మిడిల్‌ ఓవర్స్‌లో వేగంగా పరుగులు చేయడంలో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్‌ విఫలమయ్యారు. దాంతో లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఆఖరి ఓవర్లలో భారీ షాట్లు ఆడి అవుట్‌ అయినా పర్వాలేదు కానీ ఎక్కువగా డాట్‌ బాల్స్‌ ఆడొద్దు. బౌలింగ్‌ విషయంలో పర్వాలేదు. ప్రత్యర్థులను కట్టడి చేయగల బౌలింగ్‌ లైనప్‌ మా దగ్గర ఉంది.  మొదటి ఆరు ఓవర్లలో లేదా ఆఖరి ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చినా మొత్తం మీద తక్కువ స్కోర్‌కే కట్టిడి చేయగలుతున్నాం. జట్టులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ సరిచేసుకోవాలని' ధోని పేర్కొన్నాడు. 

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది. బెంగళూరు నిర్దేశించిన 170 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై బ్యాట్స్‌మెన్స్‌ విఫలమయ్యారు. అంబటి రాయుడు (42), జగదీశన్‌ (33), డూప్లెసిస్‌ (14), ధోని (10) మినహా ఎవ్వరూ రెండు అంకెల స్కోరు చేయలేదు. ఫలితంగా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 132 మాత్రమే చేశారు. చెన్నైకు వరుసగా ఇది రెండో ఓటమి. ఏడు మ్యాచుల్లో కేవలం రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. 

(చదవండి: కోహ్లి.. నీకు అర్థమవుతోందా..?)

మరిన్ని వార్తలు