నాటి పూణే జట్టు సభ్యుడి సంచలన వ్యాఖ్యలు

1 Apr, 2021 17:42 IST|Sakshi

న్యూఢిల్లీ: 2017 ఐపీఎల్‌ ఎడిషన్‌లో రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ జట్టు ఫైనల్‌ చేరడానికి మహేంద్రసింగ్‌ ధోనినే కారణమని, అందులో నాటి జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పాత్ర ఏమీ లేదని మాజీ పూణే ఆటగాడు రజత్‌ భాటియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ విషయంలో స్టీవ్‌ స్మిత్‌కు ధోనికి పోలికేంటని, అసలు స్మిత్‌ను ధోనీతో పోల్చడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో టాప్‌ 10 కెప్టెన్లలో కూడా స్మిత్‌ ఉండడని పేర్కొన్నాడు.

గతేడాది స్మిత్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినప్పుడు తాను ఆశ్చర్యపోయానని, కీలక సమయాల్లో అతను తీసుకునే నిర్ణయాలు సరైనవి కావని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ స్పోర్ట్స్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కాగా, రజత్‌ భాటియా తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, పూణే సూపర్‌ జెయింట్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 

ఇదిలా ఉండగా, ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసుల నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై 2015లో రెండేళ్లు పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో 2016, 2017 సీజన్లలో ఆయా జట్ల ఆటగాళ్లు నూతన ఫ్రాంఛైజీలైన గుజరాత్‌ లయన్స్‌, రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ జట్ల తరఫున ఆడారు. ఈ క్రమంలో పూణే కెప్టెన్‌గా స్మిత్‌, వికెట్‌ కీపర్‌గా ధోని వ్యవహరించారు. ఆ టోర్నీలో పూణే.. లీగ్‌ దశలో 9 విజయాలు సాధించి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌తో చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలై, రన్నరప్‌గా నిలిచింది.
చదవండి: అతను టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోనక్కర్లేదు: అజహర్‌

మరిన్ని వార్తలు