Ravi Shastri: ఆ వెటరన్‌ ప్లేయర్‌ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయం..!

9 Apr, 2022 16:53 IST|Sakshi

ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న ఆర్సీబీ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌కు భారత టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కడం ఖాయమని జోస్యం చెప్పాడు. మ్యాచ్‌ ఫినిషర్‌ పాత్రలో డీకే టీమిండియాకు ఎంపికవుతాడని అభిప్రాయపడ్డాడు. టీమిండియాలో ధోని తర్వాత ఆ స్థాయి ఫినిషర్‌ కనబడలేదని, దినేశ్‌ కార్తీక్‌ ధోనిలా ఫినిషర్‌ పాత్రను తప్పక న్యాయం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

డీకే ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే టీమిండియాకు ఎంపిక కావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని, అతని వయసును భారత సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవచ్చని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. రిషబ్‌ పంత్‌, ఇషాన్‌  కిషన్‌ల రూపంలో భారత వికెట్‌కీపింగ్‌ విభాగం బలంగానే ఉన్నప్పటికీ.. ఫినిషర్‌గా డీకేకు లభించి అవకాశాలను కొట్టిపారేయలేమని పేర్కొన్నాడు. 

తాజా ఐపీఎల్‌ సీజన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో పాటు నాలుగేళ్ల క్రితం నిదాహాస్‌ ట్రోఫీలో కార్తీక్‌ ఆడిన మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లను సగటు భారతీయ అభిమాని ఎప్పటికీ మరువలేడని అన్నాడు. కాగా, శ్రీలంకతో జరిగిన నిదాహాస్‌ ట్రోఫీ ఫైనల్‌లో కార్తీక్‌ 8 బంతుల్లో 29 పరుగులు సాధించడంతో పాటు ఆఖరి బంతికి సిక్సర్‌ బాది టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆడిన 3 మ్యాచ్‌ల్లో డీకే 204.55 స్ట్రయిక్‌ రేట్‌తో 90 పరుగులు సాధించి, ఆ జట్టు సాధించిన రెండు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 
చదవండి: బోణీ విజయం కోసం తహతహలాడుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌, సీఎస్‌కే.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

మరిన్ని వార్తలు