జిమ్నాస్ట్‌ మెరిక... సాధన షురూ ఇక

11 Aug, 2020 04:00 IST|Sakshi

ఐదున్నర నెలల తర్వాత దీపా ప్రాక్టీస్‌

అగర్తలా (త్రిపుర): కరోనా లాక్‌డౌన్‌తో దేశంలోని అన్ని స్టేడియాలు మూతపడ్డాయి. దాంతో క్రీడాకారులందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమయ్యాక మూడో దశ సడలింపుల్లో భాగంగా స్టేడియాల్లో క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌లో స్టార్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మొదలుపెట్టగా... తాజాగా త్రిపుర రాజధాని అగర్తలాలో భారత మేటి మహిళా జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌తోపాటు ఇతర జిమ్నాస్ట్‌లు తమ సాధన ప్రారంభించారు.

స్థానిక నేతాజీ సుభాష్‌ రీజినల్‌ కోచింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఎస్‌ఆర్‌సీసీ) ఇండోర్‌ స్టేడియంలో దీపా కర్మాకర్‌ తన కోచ్‌ బిశ్వేశ్వర్‌ నందితో కలిసి ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. 2016 రియో ఒలింపిక్స్‌లో వాల్టింగ్‌ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన దీపా కర్మాకర్‌ ఆ తర్వాత గాయాలబారిన పడి మరో మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగలేకపోయింది. ‘మార్చి 16న జిమ్నాజియం మూతపడింది. ఐదున్నర నెలలు ఇంట్లోనే గడిపా. సుదీర్ఘకాలంపాటు క్రీడా పరికరాలకు దూరంగా ఉంటే క్రీడాకారులందరికీ ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. అయితే ట్రైనింగ్‌ లేని సమయంలో నా వ్యక్తిగత కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది ఆన్‌లైన్‌లో ఫిట్‌నెస్‌ తరగతులు తీసుకున్నారు’ అని దీపా కర్మాకర్‌ వ్యాఖ్యానించింది. 

>
మరిన్ని వార్తలు