దేశవాళీ సీజన్‌కు ముహూర్తం

14 Dec, 2020 04:30 IST|Sakshi
డిఫెండింగ్‌ చాంపియన్‌ కర్ణాటక (ఫైల్‌)

జనవరి 10 నుంచి ముస్తాక్‌ అలీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌

న్యూఢిల్లీ : కరోనా కారణంగా చాలా ఆలస్యమైన దేశవాళీ క్రికెట్‌ టోర్నీల నిర్వహణపై కదలిక వచ్చింది. కొత్త సంవత్సరం ఆరంభంలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీతో దేశవాళీ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. బయో సెక్యూర్‌ హబ్‌లను ఏర్పాటు చేసి ఆరు రాష్ట్రాల్లో జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్‌ అలీ టోర్నీని నిర్వహించనున్నట్లు బీసీసీఐ అనుబంధ సంఘాలకు జై షా మెయిల్‌ ద్వారా తెలిపారు. ‘టోర్నీలో పాల్గొనాలనుకునే రాష్ట్ర జట్లు జనవరి 2వ తేదీన సంబంధిత వేదికల వద్దకు రావాల్సి ఉంటుంది. 10 నుంచి పోటీలు జరుగుతాయి. 31న ఫైనల్‌ నిర్వహిస్తాం. ఈ టోర్నీ గ్రూప్‌ దశ పోటీలు ముగిశాకే రంజీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీలపై ఓ నిర్ణయం తీసుకుంటాం. ముస్తాక్‌ అలీతో పాటు మరో టోర్నీ నిర్వహణను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సంఘాలు ఏర్పాట్లు చేసుకోవాలి’ అని జై షా సూచనప్రాయంగా తెలిపారు.  
 

మరిన్ని వార్తలు