ఓటమి దిశగా సౌత్‌జోన్‌

25 Sep, 2022 04:56 IST|Sakshi

కోయంబత్తూర్‌: వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్‌ ఓటమి దిశగా సాగుతోంది. 529 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన సౌత్‌జోన్‌ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. నేడు చివరిరోజు సౌత్‌జోన్‌ గెలవాలంటే మరో 375 పరుగులు చేయాలి. వెస్ట్‌జోన్‌ నెగ్గాలంటే మరో నాలుగు వికెట్లు తీయాలి.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన వెస్ట్‌జోన్‌ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. యశస్వి జైస్వాల్‌ (265; 30 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ (127 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్స్‌) సెంచరీతో చెలరేగగా... హెట్‌ పటేల్‌ (51 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో రాణించాడు.  

>
మరిన్ని వార్తలు